రాజన్న సిరిసిల్ల/కరీంనగర్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): సాగు పెట్టుబడుల బాధలు తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు రైతన్న జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దండగన్న సమైక్య పాలకుల కండ్లు తెరిపించేలా వ్యవసాయాన్ని పండుగలా చేసింది. విత్తు నుంచి మొదలు మందుల దాకా వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించి ఆదుకుంటుంది. వానాకాలం సీజన్ ఆరంభంలోనే రైతుబంధు సాయాన్ని అందించి భరోసానిస్తున్న సర్కారు, ఈ నెల 28 నుంచి ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో 6.80 లక్షల మందికిపైనే రైతులు
రైతు బంధు పథకంతో వ్యవసాయం బంగారమైంది. రోజురోజుకూ సాగు విస్తీర్ణం రెట్టింపవుతున్నది. దీనికి తోడు రాష్ట్ర సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రతి పంటకు గోదావరి జలాలను అందిస్తుండడంతో మొన్నటి దాకా బీడుపడ్డ భూముల్లో సిరుల పంట పండుతున్నది. పంట పెట్టుబడికి అప్పులు చేయకుండా రైతుబంధు సాయమందించి అండగా నిలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 6.80 లక్షల మందికి పైగా రైతులకు ఏటా వందల కోట్లకు పైనే సాయం అందిసున్నది. ఈ సీజన్కు గాను ఈ నెల 28 నుంచి అందించేందుకు కసరత్తు చేస్తున్నది. కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1,25,980 మంది రైతులకు రూ.131 కోట్లు సాయం అందనున్నది. ఈ వానకాలంలో కొత్తగా 8,403 మంది రైతుబంధు సాయం అందుకోనుండగా, కర్షకుల్లో సంతోషం వ్యక్త మవుతున్నది.
ఏటా పంట సాయం అందుతుంది..
మాది ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్. నాకు ఊళ్లే తొమ్మిదెకరాల పొలం ఉంది. నాటి సమైక్య సర్కారు పుణ్యమా అని కరెంటు రాక, నీళ్లు లేక గోస పడ్డాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక సీఎం కేసీఆర్ దయతో 24 గంటలు కడుపు నిండా కరెంటు, సాగుకు సరిపడా నీళ్లు వచ్చినయ్. కాలం కలిసొచ్చింది. పంట పెట్టబడి సాయం ఎకరాన రూ.10వేల చొప్పున 90వేలు వస్తున్నయ్. ఇంకా ఏం కావాలి. విత్తనాలకు అప్పులు చేసే కాలం పోయింది. పత్తేసిన పంటభూమిలో వరి వేసిన, కుప్పలుకుప్పలుగా వడ్లు పండినయ్. చేతినిండా పైసల్ కనిపిస్తున్నయ్. అన్నింటికన్నా ఎవుసమే బాగనిపిస్తున్నది.
– మాతిరెడ్డి కిషన్రెడ్డి, రైతు, పెద్ద లింగాపూర్, ఇల్లంతకుంట మండలం
దేశంలోనే ఏకైక రైతు ప్రభుత్వం
దేశంలోనే ఏకైక రైతు ప్రభుత్వం తెలంగాణనే. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులకు పెట్టుబడి సాయంతో చేయూతనిస్తున్నది. సమైక్య పాలనలో కరెంటు కష్టాలు అందరం అనుభవించాం. కానీ స్వరాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ను చూస్తున్నాం. రైతు పండించిన ధాన్యం కొనమని కేంద్రం చేతులెత్తేసినా నేనున్నానంటూ సీఎం కేసీఆర్ ముందుకొచ్చి ఆదుకున్నరు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు అందించి ఆదర్శంగా నిలిచారు. ఈ నెల 28 నుంచి బ్యాంకు ఖాతాల్లో పైసల్ జమ చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పంట పెట్టుబడి సాయం సకాలంలో అందిస్తున్నందుకు సీఎంకు రైతుల పక్షాన కృతజ్ఞతలు.
– గడ్డం నర్సయ్య, జిల్లా రైతుబంధు సమితి చైర్మన్ సిరిసిల్ల.