కార్పొరేషన్, జూన్ 26 : ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు అడుగులు వేస్తున్న రాష్ట్ర సర్కారు ‘మన ఊరు- మన బడి’ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నది. ప్రత్యేక నిధులు కేటాయిస్తూ విద్యాలయాలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. అయితే, కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ పథకం కింద నగరంలోని పాఠశాలలను ఆకర్షణీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. పిల్లల్లో మేథోశక్తిని పెంచేందుకు స్మార్ట్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయాలని భావించి, గతంలోనే 52 ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేసింది. పనులకు సంబంధించి రూ.12 కోట్లతో టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది.
ప్రయోగాత్మకంగా కార్ఖానగడ్డ స్కూల్
కరీంనగర్ కార్ఖానాగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక తరగతి గదిని ప్రయోగాత్మకంగా స్మార్ట్ క్లాస్ రూంగా తీర్చిదిద్దారు. ఈ మేరకు ఈ క్లాస్ రూంను శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. క్లాస్లోని విద్యార్థులకు స్మార్ట్ విద్యకు అనుగుణంగా క్రోమ్ బుక్స్ (లాప్టాప్స్)ను పంపిణీ చేశారు. ఈ క్లాస్ రూం ద్వారా బోధన పద్ధతి, విద్యార్థుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని ఇతర ప్రభుత్వ స్కూళ్లలోనూ ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
52 స్కూళ్లలో అమలు
స్మార్ట్సిటీలో భాగంగా స్మార్ట్ ఎడ్యుకేషన్ అందించేందుకు వీలుగా నగరంలోని 52 ప్రభుత్వ పాఠశాలల్లో 104 క్లాస్ రూంలను స్మార్ట్గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆయా స్కూళ్లలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వీటిని నిర్మించనున్నారు. ఒక ప్రొజెక్టర్తోపాటు స్క్రీన్ డిస్ప్లే ఏర్పాటు చేస్తారు. డిజిటల్ పద్ధతిలోనే పూర్తిగా బోధన అందిస్తారు. ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు బోధిస్తారు. స్క్రీన్ డిస్ప్లే బోర్డులా పనిచేస్తుంది. వీటి ద్వారా విద్యార్థులను అత్యుత్తమమైన విద్యనందించే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.