సిరిసిల్ల/ సిరిసిల్లటౌన్/ కలెక్టరేట్/ గాంధీచౌక్, జూన్ 24 : హైదరాబాద్లో పెరిగి, చదివిన తనకు కుల, మత పిచ్చి లేదని, తాను అందరివాడినని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. అభివృద్ధే తన కులమని, సంక్షేమమే తన మతమని, పేదరికానికి కులం లేదని చెప్పారు. అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యమిస్తానని, రెడ్డి సంక్షేమానికి సహకారం అందిస్తానని, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మొదట సిరిసిల్ల బైపాస్రోడ్డులో రెడ్డి సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి, రెడ్డి సంక్షేమ సంఘం పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత పట్టణంలో పలు కార్యక్రమాలకు హాజరై, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ప్రసంగించారు.
తాను అందరివాడినని, అలాగే ఉండాలని అనుకుంటున్నానని, తన ఎదుగుదలకు కారణమైన సిరిసిల్ల గడ్డ ప్రజల వెంట ఉండి రుణం తీర్చుకుంటానని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ప్రసంగించారు. సమాజంలో ఉన్నవి రెండే కులాలని, ఒకటి డబ్బున్న వాళ్లు, రెండు డబ్బు లేని వాళ్లని అభిప్రాయపడ్డారు. ప్రతి కులంలోనూ పేదలు ఉన్నారని, రెడ్డి కుటుంబాల్లోనూ పేదరికంతో అల్లాడుతున్న వారున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముస్తాబాద్ మండలం బందనకల్లో ఓ రైతు మృతి చెందగా పరామర్శకు వెళ్లానని, పేద కుటుంబమైన వారి కష్టాలను చూసి చలించిపోయానని గుర్తు చేశారు.
ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేదరికంలో ఉన్న అన్ని కులాలకు అందేలా సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. ఆసరా, రైతుబంధు, రైతు బీమా వంటివి ప్రతి కులానికీ అందుతున్నాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు రైతు బీమా సదుపాయం కల్పించామని, ఈ నెల 28న మరోసారి రైతుబంధు నగదు జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 58 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారని వెల్లడించారు. ఎనిమిదేళ్ల క్రితం కరెంట్ లేక నానా తంటాలు పడ్డ ప్రజలు ప్రస్తుతం ఇస్తున్న నిరంతర విద్యుత్తో అవన్నీ మరిచిపోయారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు ఆరు మీటర్లపైకి వచ్చాయని, రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి సంరక్షణ విధానాలు లాల్ బహదూర్శాస్త్రి అకాడమీలో ట్రైనీ కలెక్టర్లకు పాఠాలుగా మారాయని చెప్పారు.
విద్యాభివృద్ధికి చిరునామా
విద్యాభివృద్ధికి రాజన్న సిరిసిల్ల చిరునామాగా మారిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లెల్లలో అద్భుతమైన వ్యవసాయ కళాశాల భవనం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉందని, సర్దాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, సిరిసిల్లలో వైద్య కళాశాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో అగ్రహారంలో ఇంజినీరింగ్ కళాశాల ఉందని, త్వరలో పక్కా భవనం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్లో డిగ్రీ కాలేజీలను త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్ని కులాల్లోని పేద బాలబాలికలకు హాస్టల్ వసతిని కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయం
హైదరాబాద్లో పెరిగి కాన్వెంట్ స్కూల్లో చదివిన తనకు కులమత పిచ్చి లేదని, రాజకీయాల్లోకి వచ్చాకే వాటి గురించి తెలిసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కులమతాలకతీతంగా సబ్బండ వర్గాల అభ్యున్నతే తన ధ్యేయమని స్పష్టం చేశారు. బీసీలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని గౌరవముందని, సమైక్య రాష్ట్రంలో 16 బీసీ గురుకులాలుంటే ప్రస్తుతం రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు ఉన్నాయన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టి మిగిలిన అర్హులకు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఏ రాష్ట్రంలో లేనివిధంగా గొల్ల కుర్మలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం వల్లే అధిక లబ్ధి కలిగిందన్నారు. ఇప్పటికే జిల్లాలోని పద్మశాలి, రెడ్డి సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలను కేటాయించి, ఆర్థిక సాయం అందించామని తెలిపారు. అదే మాదిరిగా ముదిరాజ్, గౌడ, గంగపుత్ర, గొల్ల, కుర్మ మున్నూరుకాపుతో పాటు అన్ని కులాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు స్థలాలను కేటాయిస్తామన్నారు. ఈ స్థలాల్లో ఫంక్షన్హాలుతోపాటు బాలబాలికలకు హాస్టళ్లు నిర్మించాలన్నారు. ఆత్మగౌరవ భవనాల భూమి పూజకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని, ఆ సమావేశంలో సాదకబాధకాలను తెలుసుకుంటానని చెప్పారు.
తాత్కాలిక కోర్టు భవనానికి 20 లక్షలు
సిరిసిల్ల కోర్టు ఆవరణలో తాత్కాలిక కోర్టు నిర్మాణం చేపట్టాలని, ఇండ్ల స్థలాలు కేటాయించాలని న్యాయవాదులు కోరడంతో వెంటనే మంత్రి స్పందించారు. 20 లక్షలు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇండ్ల స్థలాల కేటాయింపును వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతికి ఫోన్ ద్వారా సూచించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కతజ్ఙతలు తెలిపారు.
మంత్రికి కృతజ్ఞతలు
అడిగిన వెంటనే రెడ్డి సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి నందుకు మంత్రి కేటీఆర్కు జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూర అంజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తాము మంత్రి వెన్నంటి ఉంటామని చెప్పారు.
రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తా
రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తాను తీసుకెళ్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం వేదికగా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతోనే నాకు ప్రపంచస్థాయి గుర్తింపు
“2009 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను మంత్రిని అవుతానని అనుకోలేదు. సిరిసిల్ల ప్రజల ఆశిర్వాదంతో ఢిల్లీ, అమెరికా వెళ్లి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఉన్నది. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్గా మారింది. వ్యవసాయ, వ్యవసాయ పాలిటెక్నిక్, నర్సింగ్, జేఎన్టీయూ కళాశాలు వచ్చాయి. త్వరలో రానున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తా. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేయిస్తా.
–మంత్రి కేటీఆర్