హైదరాబాద్ రవీంద్రభారతి తరహాలో కరీంనగర్లో ఆడిటోరియం
500 మంది సీటింగ్ సామర్థ్యం.. ఆధునిక సౌండ్ సిస్టం
ఇటీవలే 12.50 కోట్ల నిధుల కేటాయింపు
వారం క్రితమే పనులు ప్రారంభం
వీలైనంత త్వరగా పూర్తికి బల్దియా కసరత్తు
కార్పొరేషన్, జూన్ 24: కరీం‘నగరం’ ఒడిలో మరో కళాతోరణం చేరబోతున్నది. సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల కోసం హైదరాబాద్లోని రవీంద్రభారతి తరహాలో ‘అమృత వర్షిణి’ పేరిట ఆడిటోరియం రూపుదిద్దుకోబోతున్నది. స్మార్ట్ సిటీ కింద రాష్ట్ర సర్కారు 12.50 కోట్ల నిధులు కేటాయించగా, 500 మంది సీటింగ్ సామర్థ్యం, అత్యాధునిక సౌండ్ సిస్టంతో ఎస్సారార్ కాలేజీ సమీపంలో నిర్మాణం కాబోతున్నది. వారం క్రితం మంత్రి గంగుల భూమి పూజ చేయగా, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని నగర పాలక సంస్థ యంత్రాంగం భావిస్తున్నది.
కరీంనగర్లో సాంసృతిక కార్యక్రమాలు, కళాకారుల కోసం అత్యంత ఆధునిక హంగులతో అమృతవర్షిణి పేరిట అద్భుత నిర్మాణం చేపట్టేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. నగరంలో ఉన్న ఏకైక కళాభారతి ప్రస్తుతం సరైన సదుపాయాలు లేక అంతంత మాత్రంగానే నడుస్తున్నది. దీనికి మార్పులు చేసి ఆధునిక సదుపాయాలతో మంచి కళాభారతిని నిర్మించాలని గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిపాదనలు చేయగా, ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా గత పదేళ్ల కిత్రం ఆధునికంగా కళాభారతిని నిర్మిస్తామంటూ అప్పటి ప్రభుత్వ పెద్దలు కరీంనగర్లోని నగరంలోని ఎస్సారార్ డిగ్రీ కాలేజీ ఆవరణలోని స్థలంలో పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. తర్వాత గత ఐదేళ్లలో కూడా నూతన కళాభారతి నిర్మాణానికి సమాలోచనలు చేసినా, కొన్ని కారణాలతో పెండింగ్లో పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుత నగరపాలక వర్గం దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎస్సారార్ కాలేజీ సమీపంలోనే అత్యంత ఆధునిక సదుపాయాలతో సాంసృతిక కార్యక్రమాల కోసం అద్భుత నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న 12.50 కోట్ల నిధులతో రవీంద్రభారతి తరహాలో తీర్చిదిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇటీవల (శనివారం)పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు.
అత్యాధునిక వసతులు..
కళాభారతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అత్యంత ఆధునిక సౌండ్ సిస్టం, కళాకారుల కోసం అన్ని వసతులు కల్పనకు ప్రణాళికలు వేశారు. ఓ చోట 500.. మరో చోట 100 మంది కూర్చొనేలా రెండు వేర్వురుగా హాల్స్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ సౌండ్ సిస్టం వల్ల ఇబ్బందులు రాకుండా సౌండ్ ప్రూఫ్ టెక్నాలజనీని వినియోగిస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక నిర్మాణాలు, పురుషులు, మహిళల కోసం వేర్వురుగా డ్రెస్సింగ్ రూంలు, మరుగుదొడ్లను నిర్మించబోతున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభంకాగా, నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ వేగంగా పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ నిర్మాణం నగరానికి వచ్చే కళాకారులకు అద్భుతమైన అనుభూతిని కల్పించేలా ఉంటుందని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నారు.