ముకరంపుర, జూన్ 24: పారదర్శకంగా.. వేగంగా సేవలందించే దిశగా అటవీ శాఖ ముందుకెళ్తున్నది. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే సాంకేతికతను వినియోగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తుండగా… ఇప్పుడు కార్యాలయాల్లో సైతం ఈ-ఆఫీస్కు శ్రీకారం చుట్టారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు కాలంతో పోటీ పడుతూ పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తికాగా ప్రస్తుతం జిల్లాల వారీగా రికార్డుల డిజిటలైజేషన్పై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన ఓ ఐటీ సేవల సంస్థ జిల్లాల్లో ఈ-ఆఫీసు వ్యవస్థకు సంబంధించి వేగంగా పనులు చేపడుతున్నది.
జాప్యానికి చెక్..
రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన వివిధ రకాల సేవలు పొందడానికి అనేక మంది పలు రకాల దరఖాస్తులు అందజేస్తుంటారు. వీట న్నీంటినీ ముందుగా కార్యాలయ ఇన్వార్డులో నమోదు చేస్తుండగా, అనంతరం విభాగాల వారీగా సంబంధిత అధికారులు, విభాగాధిపతులకు చేరుతాయి. ఒక్కోసారి దరఖాస్తు సంబంధిత అధికారికి చేరడానికి రోజుల తరబడి సమయం తీసుకోవడంతో పాటు దరఖాస్తు ఎక్కడ… ఏ స్థితిలో ఉన్నదో తెలుసుకోవడం కొంత ఇబ్బందిగా ఉండేది. అయితే ఈ-ఆఫీస్ ద్వారా మెరుగైన సేవలందే అవకాశం ఉంటుంది. కార్యాలయానికి రోజువారీగా వచ్చే దరఖాస్తులతో వివిధ విభాగాలకు చెందిన ఫైళ్ల స్థితిని అధికారులు నేరుగా పరిశీలించడం వల్ల జాప్యానికి తావుండదు.
భద్రంగా పాత ఫైళ్లు, రికార్డులు
కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు కలిపి కరీంనగర్ జిల్లాకేంద్రంలో అటవీ శాఖ కార్యాలయం ఉన్నది. పాలనా వ్యవహారాలతో పాటు శాఖకు సంబంధించిన క్షేత్ర స్థాయి కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణ ఇక్కడి నుంచే జరుగుతున్నది. రెండు జిల్లాల రికార్డులన్నీ ఇక్కడే ఉన్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వీటిని జాగ్రత్తగా భద్రపరచాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో విభాగాల వారీగా ఫైళ్లు, రికార్డులను డిజిటలైజేషన్ చేస్తున్నారు. అవసరాన్ని బట్టి సెక్షన్ల వారీగా ఫైళ్లను పరిశీలించేలా ప్రతి పేజీనీ స్కానింగ్ చేస్తున్నారు. ఒక్కో సెక్షన్లో పాత ఫైళ్లు వేల సంఖ్యలో ఉన్నాయి. పేజీల్లో ఉన్న పూర్తి సమాచారంతో పాటు రికార్డులు దెబ్బతినకుండా, రూపు చెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అత్యాధునిక స్కానర్లను వినియోగిస్తూ నిమిషానికి వందల పేజీలను స్కానింగ్ చేస్తున్నారు.