సిరిసిల్ల, జూన్ 24 : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఐదున్నర గంటలకు పైగా ఇక్కడే గడిపిన ఆయన, వివిధ కుల సంఘాల నాయకుల విన్నపాలను ఆలకిస్తూ.. అండగా ఉంటానని భరోసానిస్తూ ముందుకుసాగారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సిరిసిల్ల పట్టణానికి చేరుకున్న మంత్రి మొదట బైపాస్రోడ్డులో రెడ్డి సంక్షేమ సంఘ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన నాలుగు ఎకరాల స్థలంలో భూమి పూజ చేశారు. అనంతరం రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కూర అంజిరెడ్డి, పాలకవర్గ సభ్యులతో సాయిమణికంఠ ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘ సభ్యులకు అమలు చేస్తున్న బీమా బాండ్లను అందజేశారు. అనంతరం పాలకవర్గ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించారు.
తర్వాత సమీకృత కలెక్టరేట్లో న్యాయవాదులతో సమవేశమయ్యారు. అక్కడే యాదవ, ముదిరాజ్, గౌడ, మున్నూరుకాపు కులసంఘాల నేతలతో సమావేశమై, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లయన్స్క్లబ్ ఉమ్మడి జిల్లా గవర్నర్ నాగుల సంతోష్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వాహనాలతో పాటు ఆరు ఈసీజీ పరికరాలు, 100 ఫస్ట్ ఎయిడ్ బాక్స్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రముఖ రచయిత జనపాల శంకరయ్య రచించిన ‘సిరిసిల్ల అభివృద్ధిపై బహుముఖ ప్రజ్ఞాశాలి కల్వకుంట్ల తారకరామారావు’ బుర్ర కథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకోగా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంకు చెందిన 150 మంది యువకులు ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సిరిసిల్ల టీఆర్ఎస్ యూత్ విభాగం పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్కుమార్, కత్తెర వరుణ్, మునీర్, ఎరవెల్లి వెంకటరమణారావు, నీరటి శ్యామ్, సలేంద్రి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆయా పార్టీలకు చెందిన యువకులు టీఆర్ఎస్లో చేరారు.
సాయంత్రం 4:30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని బొప్పాపూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి ఇంట్లో జరిగిన శుభకార్యానికి మంత్రి హాజరయ్యారు. 5:20 గంటలకు గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండాలో జగదాంబదేవీ, సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండాకు చెందిన చిన్నారులతో సెల్ఫీలు దిగారు. అక్కడే ఓ గిరిజన బాలికను ఎత్తుకొని ముద్దు చేశారు. సాయంత్రం 6:15 గంటలకు ముస్తాబాద్లో శ్రీకృష్ణయాదవ సంఘం ఫంక్షన్హాల్ను ఎంపీపీ జనగామ శరత్రావు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, యాదవ సంఘం నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీకోడు, ముస్తాబాద్తో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన 30 మంది యువకులు పార్టీలో చేరగా, మంత్రి ఆహ్వానించారు.
అనంతరం హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకుడు ఏనుగు మనోహర్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు ఎన్ ఖీమ్యానాయక్, సత్యప్రసాద్, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి, నాయకులు నేవూరి వెంకట్రెడ్డి, చక్రధర్రెడ్డి, మట్ట వెంకటేశ్వర్రెడ్డి, సింగిరెడ్డి రవీందర్రెడ్డి, పూర్మాణి రాంలింగారెడ్డి, రాఘవరెడ్డి, లక్కిరెడ్డి కమలాకర్రెడ్డి, రెడ్డి మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు నేవూరి మమతారెడ్డి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్, ఏఎంసీ చెర్పర్సన్ శీలం జనాబాయి, యాదవ సంఘం ముస్తాబాద్ అధ్యక్షుడు చెవుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.