కొత్తపల్లి, నవంబర్ 18: ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు కరీంనగర్ సిద్ధమైంది. చీఫ్ మినిస్టర్ కప్-2021 పేరిట జిల్లా కేంద్రంలోని డా.బీఆర్ అంబేద్కర్ స్టేడియం ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 21 వరకు జరుగనున్న జాతీయస్థాయి కరాటే పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినీనటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభిస్తారని టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్స్ ఈ శ్రీనివాస్, మాడుగుల ప్రవీణ్ వెల్లడించారు. ఈ పోటీలకు 19 రాష్ర్టాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు, 300 మంది రెఫరీలు, జడ్జిలు, ఇతర అఫీషియల్స్ పాల్గొంటున్నారని తెలిపారు. కెడెట్స్, సబ్ జూనియర్, సీనియర్స్, కటా, కుమిటీ కేటగిరీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు జరుగుతాయని, విజేతలకు రూ.3 లక్షల వరకు నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు వివరించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి రజనీశ్ చౌదరి, కాయ్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, జిల్లా అధికారులు, టోర్నమెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడు చల్ల హరిశంకర్, టోర్నమెంట్ చైర్మన్ కత్తెరపాక మొండయ్య పోటీల నిర్వహణలో భాగస్వాములవుతారని వెల్లడించారు.