మంథని రూరల్, జూన్ 21: గోదావరి జలాలను తెలంగాణ బీళ్లకు మళ్లించాలనే గొప్ప సంకల్పంతో రీ ఇంజినీరింగ్ విధానంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి మూడేళ్లు పూర్తి చేసుకొని నాలుగో ఏట అడుగు పెట్టిన సందర్భంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంపుహౌస్లో ఇంజినీర్ల మధ్య కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు.
ఈ సందర్భంగా ఈఎన్సీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇరిగేషన్ వ్యవస్థనే పూర్తిగా ప్రక్షాళన చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ ఇంజినీర్ల ముందు కాళేశ్వరం వంటి ఒక గొప్ప టాస్క్ను పెట్టి ఇంజినీరింగ్ అద్భుతాన్ని గోదావరి నదిపై సృష్టించారని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలోనే గొప్పగా నిలుస్తుందన్నారు. అనంతరం ఇంజినీర్లు ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ బ్యారేజీ ఈఈ అలకొండ యాదగిరి, పార్వతీ బ్యారేజీ ఈఈ ఓంకార్ సింగ్, డీఈఈ రాంచందర్ పాల్గొన్నారు.