చిగురుమామిడి, జూన్ 11: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్కు తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని త్వరలోనే ట్రయల్ రన్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. శనివారం ప్రాజెక్టును స్థానిక ఎమ్మెల్యే సతీశ్కుమార్, ప్రభుత్వ ఇంజినీరింగ్ సలహాదారు పెంటారెడ్డి, చీఫ్ ఇంజినీర్ శంకర్తో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల సాగు నీటి కల త్వరలోనే సాకారం కానున్నదని చెప్పారు. ఈ ప్రాంత బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు. కాళేశ్వరం నుంచి మిడ్మానేర్ నుంచి తోటపల్లి రిజర్వాయర్కు, అకడి నుంచి గ్రావిటీ ద్వారా గౌరవెల్లి ప్రాజెక్ట్ పంప్హౌస్కు నీరు చేరుతుందన్నారు. భారీ మోటర్ల ద్వారా నీటిని పంపింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ కేవలం 1.141 టీఎంసీ మాత్రమే ఉండగా, సీఎం కేసీఆర్ రీ డిజైన్తో నీటి సామర్థ్యం 8.3 టీఎంసీలకు పెరిగిందని చెప్పారు. కుడి కాలువ ద్వారా 90 వేలు ఎడమ కాలువ ద్వారా 16 వేల ఎకరాలకు నీరందుతుందని వెల్లడించారు. అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లోని 15 , కోహెడ మండలంలోని 8, చిగురుమామిడి మండలంలోని 10, భీమదేవరపల్లి మండలంలోని 12, ధర్మసాగర్ మండలంలోని 13, ఘన్పూర్లోని 10, సైదాపూర్లోని 3, హన్మకొండ, జఫర్ఘడ్, రఘునాథపల్లి మండలాల్లోని ఐదు గ్రామాలకు సాగునీరందుతుందన్నారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరనున్నదన్నారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షత, పట్టుదలతోనే గౌరవెల్లి ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తవుతుందని పేర్కొన్నారు.