మల్యాల, జూన్ 9: జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోని వివిధ ఠాణాల పరిధిలో బైక్లు దొంగలిస్తున్న ముగ్గురిని మల్యాల పోలీసులు పట్టుకున్నారు. రూ.10లక్షల విలువైన 16 ద్విచక్రవాహనాలను రి కవరీ చేశారు. ఈ మేరకు మల్యాల ఠాణాలో జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ విలేకరులతో వివరాలు వెల్లడించారు. ఎప్పటిలాగే మల్యాల సీఐ రమణమూర్తి, ఎస్ఐ చిరంజీవి గురువారం వాహనాల తనిఖీ చేపట్టారని చెప్పారు.
ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతని పేరు ఉప్పు రమణారెడ్డి అని, ఊరు కొండగట్టు అని, ఇటీవల పలు బైక్లు అపహరించినట్లు చెప్పాడన్నారు. రమణారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు మల్యాల సర్కి ల్ ఎస్ఐలు చిరంజీవి, వెంకట్రావ్, శ్వేత బృందాలుగా సోదాలు చేయగా, ఆరు బైక్లు రికవరీ అయ్యాయని, మరో రెండింటి ఆచూకీ దొరకలేదని చెప్పారు. రమణారెడ్డిపై ఇప్పటికే 22 కేసులు నమోదై ఉన్నాయని, ఇప్పుడు దొంగలించిన వాహనాల ఆధారంగా 30 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. మల్యాల ఠాణాలో సైతం సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయిందని, ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు త్వరలోనే రమణారెడ్డిపై పీడీ యా క్ట్ను నమోదు చేస్తామని వెల్లడించారు.
ఇక ఇద్దరు మైనర్లు దొంగలించిన 10 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పార్క్ చేసిన వాహనాలను కాలితో గట్టిగా తన్ని హ్యాండిల్ లాక్ తొలగించి, తాళం చెవి లేకుండానే వైర్ల సాయంతో స్టార్ చేసి దొంగలిస్తున్నట్లు విచారణలో తెలిసిందని చెప్పారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని వివరించారు. రమణారెడ్డిని రిమాండ్కు తరలించగా, మైనర్లను జువైనల్ కోర్టుకు తరలించనున్నట్లు చెప్పారు. నిందితులను పట్టుకుని, వాహనాలు రికవరీ చేసిన మల్యాల సీఐ రమణమూర్థి, మల్యాల, పెగడపల్లి, కొడిమ్యాల ఎస్ఐలు చిరంజీవి, శ్వేత, వెంకట్రావును డీఎస్పీ అభినందించారు.