కోనరావుపేట, జూన్ 9: ‘మన ఊరు మన బడి’లో భాగంగా పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చల్మెడ కుటుంబం చరిత్రలో నిలిచిపోయేలా బడిని నిర్మించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య వర్ణించారు. మాజీ న్యాయశాఖ మంత్రి చల్మెడ ఆనందరావు తన తల్లి జానకీదేవి జ్ఞాపకార్థం స్వగ్రామం మల్కపేటలో బడి, గుడి నిర్మించడం గొప్ప విషయమన్నారు.
రూ.కోటిన్నరతో నిర్మించిన బడిని ప్రారంభించేందుకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వస్తున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావుతో కలిసి కోనరావుపేట మండలం మల్కపేటలో గురువారం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎకరం స్థలంలో ఆధునిక హంగులతో కూడిన పాఠశాలను గ్రామానికి అందించడం సంతోషకరమన్నారు. ఇది భవిష్యత్ తరాలకు స్థిరస్థాయిలో గుర్తుండి పోతుందని చెప్పారు.
ఎమ్మెల్యే రమేశ్బాబు అధ్యక్షతన జరిగే ప్రారంభోత్సవానికి మంత్రులతోపాటు జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లా నుంచి నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, సర్పంచ్ ఆరె లత, సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మంతెన సంతోష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, టీఆర్ఎస్ మహిళ విభాగం మండల అధ్యక్షురాలు చీటి సంధ్య,నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, ఆరె మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామానికి సేవ చేయాలనే బడి
గతంలో మల్కపేటలో బడి లేక కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి చదువుకునే పరిస్థితి ఉండేది. అలాంటి కష్టాలు మళ్లీ రావద్దనే ఉద్దేశ్యంతో మా నానమ్మ చల్మెడ జానకీదేవి జ్ఞాపకార్థం కోటిన్నరతో బడిని నిర్మించాం. ఇది భావితరాలకు గుర్తుండి పోతుంది. జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో బడి, గుడి నిర్మిస్తున్నాం. మన ఊరు..మన బడిలో భాగంగా పాఠశాల నిర్మించడం సంతోషంగా ఉన్నది. ప్రతి విద్యార్థీ ఈ బడిని సద్వినియోగం చేసుకోవాలి. నేటి కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆశీర్వాదం అందించాలి.
– చల్మెడ లక్ష్మీనర్సింహారావు