హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్22: కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని హుజూరాబాద్ ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్కు మంచి గౌరవం ఇచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పరిగె అని హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. అలాంటోళ్లు మనకు అవసరం లేదని, అభివృద్ధి చేసే టీఆర్ఎస్కు అండగా ఉండాలని సూచించారు. బుధవారం హుజూరాబాద్ మండలం సింగాపూర్ గెస్ట్హౌస్లో వీణవంక మండల నర్సింగాపూర్కు చెందిన సుమారు 100 మంది యాదవులు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదవులకు తెలంగాణ ప్రభుత్వం మంచి గుర్తింపు నిచ్చిందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందిస్తున్నదని చెప్పారు. గెల్లును గెలిపించే బాధ్యత మీ భుజస్కందాలపై వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్రెడ్డి, వొడితల ప్రణవ్బాబుతో పాటు యాదవ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.