“నిరుపేదలకు సంక్షేమ ఫలాలను పంచిపెట్టి ఆదుకునే పార్టీ టీఆర్ఎస్.. అదే పేదలను పీడించి పన్నుల రూపంలో లాక్కునేది బీజేపీ.. ప్రజా సంక్షేమం వైపు నడుస్తున్న టీఆర్ఎస్వైపు ఉంటారా..? పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీ వైపు వెళ్తారా..? మీరే ఆలోచించండి.. మంచి నిర్ణయం తీసుకోండి?” అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్లో 4, 5, 7, 8, 9, 10, 11వ వార్డులకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఇతర వర్గాలకు చెందిన వెయ్యి మంది టీఆర్ఎస్లో చేరగా మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారినుద్దేశించి ప్రసంగించారు. ఒక వ్యక్తి కోసం నష్టపోవద్దని, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
జమ్మికుంట చౌరస్తా/జమ్మికుంట, సెప్టెంబర్ 21: ‘రాబోయే ఉప ఎన్నికలో మీరంతా అభివృద్ధి వైపు ఉన్న టీఆర్ఎస్ దారిని ఎంచుకుంటారా? పన్నులేసి ప్రజలను పీడిస్తున్న బీజేపీ దారిని ఎంచుకుంటారా’ అని హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్లను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యికి పెంచిన బీజేపీకి ఓటు ఎలా వేస్తారని, ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ ప్రాంతానికి ఏం చేశాడని ప్రశ్నించారు. రేపు ఈటల రాజేందర్ గెలిస్తే కూడా ఏమీ చేయలేడని చెప్పారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల 17ఏళ్లు పదవిలో ఉండి నియోజకవర్గానికి ఏమి ఒరగబెట్టాడని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు మరో 50వేల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. 90 శాతం మంది ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పనిలో ఉందని ఆరోపించారు. డబ్బులకు ఆశపడి ఓటును అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. మన దగ్గర మంజూరైన ఐటీఐఆర్ను ఎప్పుడిస్తారో చెప్పి ఓట్లు అడగాలని మండిపడ్డారు. స్థానిక నాయిని చెరువును మురికి కూపం నుంచి తప్పించి మంచినీటి చెరువుగా మార్చేందుకు రూ.1.5కోట్లతో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. అలాగే ఈ చెరువులో బతుకమ్మ ఆడేందుకు, వినాయక నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ప్లాట్ఫాంలను నిర్మించనున్నట్లు తెలిపారు. జాగ లేనివారికి, సొంత స్థలం ఉన్నవారికి డబుల్బెడ్రూం ఇండ్ల్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
కేవలం ఒక వ్యక్తి కోసం నష్టపోవద్దని, డబ్బులకు ఆశపడి ఓటును అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యావంతుడు, రెండు గుంటల నిరుపేద గెల్లు శ్రీనివాస్యాదవ్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే రెండేళ్లల్లోనే అభివృద్ధిలో తన సత్తా చాటుతాడని చెప్పారు. తానూ నెలకోసారి వచ్చి పనులను పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు, రామగుండం ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, పొనగంటి మల్లయ్య, కౌన్సిలర్లు విజయలక్ష్మి, కళావతి, శ్రీలత, సారంగం, సంపత్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎందుకు సానుభూతి చూపాలె?
ప్రజలంతా సంక్షేమం, అభివృద్ధిని చూస్తున్నరు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నుంచి వెయ్యి మంది చేరిన్రు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తనూ, నాయకుడినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటం. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పదవులను అందిస్తం. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు సీనును భారీ మెజార్టీతో గెలిపించాలె. గులాబీ అడ్డా అని మరోసారి నిరూపించాలె. ఆరుసార్లు బీ ఫారం ఇచ్చిన కేసీఆర్ను ఈటల మోసం చేసిండు. పార్టీని ఎందుకు వీడిండో చెప్పుతలేడు. ఆయన సొంత ఎజెండాను మన మీద రుద్దుతుండు. పదవులన్నీ అనుభవించి వెళ్లిన అతడికి మనమెందుకు సహకరించాలె. ఎందుకు సానుభూతి చూపాలె. మనమంతా సీఎం కేసీఆర్కే మద్దతివ్వాలె. గెల్లు సీనునే గెలిపించుకోవాలె. మోత్కులగూడెం యువత, మహిళలు ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరడం అభినందనీయం. ఇదే స్ఫూర్తితో ఎన్నికల్లో పనిచేయాలి. బీజేపీకి గుణపాఠం చెప్పాలి.
పేదోడు.. గెల్లు సీనును గెలిపిస్తం..
గెల్లు సీను పేదోడు. బాగా సదువుకున్నోడు. ఉద్యమకారుడు. తెలంగాణ కోసం కొట్లాడిండు. సీఎం కేసీఆర్ ఆయన్ను ఆశీర్వదించిండు. ఇక్కడకి పంపిండు. మా మద్దతంత ఆయనకే. గరీబోడికి అన్నీ తెలుస్తయ్. పనులు జేయాలని ఉంటది. ఫోన్ జేస్తే ఎత్తుతడు. మాట్లాడుతడు. ఈ రెండేండ్లు టీఆర్ఎస్ సర్కారే ఉంటది. అభివృద్ధి కూడా వాళ్లే జేత్తరు. పనిజేసేటోళ్లతోనే ఉండాలె. వాళ్లనే గెలిపించుకోవాలె. అందుకే పార్టీలో చేరినం. గెల్లు గెలుపు కోసం పనిజేత్తం.
ద్రోహులకు గుణపాఠం చెప్పాలి
పని చేసే ప్రభుత్వంపై కుట్రలు
-మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి
ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్పై అనేక కుట్రలు జరుగుతున్నాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటరు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మన నాయకుడిని బలహీన పర్చేందుకు కొందరు పనిగట్టుకుని చిల్లర విమర్శలు చేస్తున్నరు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఈటలకు సీఎం కేసీఆర్ అవకాశమిస్తే ప్రజల బాగోగులు చూడడం మానేసి స్వప్రయోజనాల కోసం పాకులాడిండు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఎప్పుడో ఖాయమైంది
రెండు కోట్ల కొలువులేమైనయ్
-టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్
అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా దేశ వ్యాప్తంగా రెండు కోట్ల కొలువులు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం హామీలు ఏమైనయ్. రైల్వే, పోస్టల్, టెలికాం ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మన యువకులు ఉద్యోగాలు చేయద్దా?. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే లక్షన్నర మందికి పోలీసులుగా, వీఆర్వోలుగా, డిప్యూటీ తహసీల్దార్లుగా, ఏఈవోలుగా, సబ్రిజిస్ట్రార్లుగా ఉద్యోగాలు కల్పించింది. ఇంకా 50వేల మందికి కొలువులిచ్చేందుకు సిద్ధంగా ఉంది. పేదింటి బిడ్డనైన నాకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అందరూ దీవించి కారు గుర్తుకు ఓటు వేసి మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించండి.
ఇట్లాంటి పార్టీని సూడలే.. ఇగ సూడం
జమ్మికుంట డెవలప్మెంట్ ఉరుకుతంది. సీఎం కోట్లిత్తండు. మంత్రి హరీశ్రావు తెత్తండు. పట్టణాన్ని మస్తు అభివృద్ధి చేస్తన్రు. గతంల పట్టించుకోని అంబేద్కర్ కాలనీలోని మురికాల్వలకు కోట్లిచ్నిన్రు. నాయిని చెరువును బతుకమ్మ బండగా చేత్తన్రు. ఇవన్నీ సూసిన. ఇట్లాంటి పార్టీని ఇంతకు ముందెన్నడూ సూడలె. మనం ఇగ సూడం. 22 ఏండ్లపాటు నేను టీడీపీల ఉన్న. ఇప్పుడు ఆ పార్టీని ఇడిసి టీఆర్ఎస్ల చేరిన. నా వంతుగా పనిచేస్త. గెల్లు సీనన్న గెలుపు కోసం ముందుంట.
-మొలుగూరి మొగిలి, మోత్కులగూడెం
బీజేపోళ్లు ఏం చేస్తరో చెప్తలేరు..
బీజేపీతోని ఏమైతది? ఏమీ కాదు. అందుకే ఆ పార్టీ నుంచి బయటకచ్చినం. టీఆర్ఎస్లో చేరినం. వాళ్లేం చేస్తరో చెప్తలేరు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నరని తెలుసుకున్నం. మేము కూడా ప్రజలవైపే ఉండాలనుకున్నం. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులైనం. పట్టణ అభివృద్ధి కోసం కోట్లిస్తున్న సర్కార్ కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నం. ఇప్పటికే రూ.50కోట్లిచ్చిన్రు. పనులు జోరుగా సాగుతున్నయ్. కండ్లముందు కనబడుతున్నది. ఇంకే చేత్తం. పార్టీలో చేరుడు తప్పా. ఎవ్వలైనా చేరాల్సిందే.
బతుకులు మారుస్తున్నడు..
ఇన్నాళ్లూ దళితులను ఎవ్వలూ పట్టించుకోలె. ఎవ్వలూ ఆదుకున్నోలె. దళితులంటేనే చిన్నచూపాయే. అట్లాంటింది. సీఎం కేసీఆర్ దళితుల గురించి ఆలోచించిండు. ఏం చేస్తే బాగుంటదనుకున్నడో అదే చేస్తున్నడు. దళితబంధు తెచ్చి బతుకులు మారుస్తున్నడు. దళితబిడ్డలంతా సంబురంగున్నరు. ఒక్కొక్కరు బండ్లు కొనుక్కుంటున్నరు. వ్యాపారం చేసుకునేందుకు సిద్ధమైతున్నరు. దళిత బంధు అచ్చినంక రోజూ పండుగజేసుకుంటున్నరు. వాళ్ల సంతోషాలను ఎవరు కాదంటరు. ఇంతజేసిన సీఎం కేసీఆర్ వెంటే దళిత బిడ్డలు ఉంటరు. ఆయన సర్కారుకే ఓటేస్తరు. వేస్తం గూడ.
బొట్టు బిళ్లలు, గొడుగులు మనకెందుకు?
ఈటల ఆరుసార్లు గెలిచిండు. రెండుసార్లు మంత్రైండు. ఆయన కోసం మనమంతా పనిజేసినం. అయినా ఎవరినీ పట్టించుకోలె. తన కోసం పనిచేసుకున్నడు. పార్టీ లోంచి పోయిండు. పోయెటప్పడు మనకేమైనా చెప్పిండా? ఆయనతో మనమెందుకు పోతం. సీఎం కేసీఆర్ జమ్మికుంట అభివృద్ధికి 50కోట్లు ఇచ్చిండు. మంత్రి హరీశ్రావు తెచ్చిండు. పనులు పరుగులు పెడ్తున్నయ్. పట్టణం మారిపోతున్నది. ఎన్నికల కోసం ఈటల ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తండు. బొట్టు బిళ్లలు, గొడుగులు పంచుతున్నడు. ఇవి మనకెందుకు. మనకు అభివృద్ధి కావాలె. సంక్షేమం కావాలె. ఇవన్నీ టీఆర్ఎస్ సర్కారిస్తంది. పనిచేసే ప్రభుత్వం వెంట ఉందాం. గెల్లును గెలిపించుకుందాం.
ఓట్ల కోసం దిగజారుతున్నడు..
ఈటల నైతిక విలువలను కోల్పోయిండు. ఓట్ల కోసం దిగజారుతున్నడు. అబద్ధాలు మాట్లాడుతున్నడు. ఇది పద్ధతి కాదు. సీఎం కేసీఆర్ ఆయనకు ఎన్ని అవకాశాలిచ్చిండు. ఆరుసార్లు టికెట్టిచ్చి గెలిపించిండు. రెండుసార్ల మంత్రిని జేసిండు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించిండు. ఇంకేం చేయాలె. కానీ, ఈటల తప్పులు చేసిండు. తప్పించుకునేందుకు బీజేపీలో చేరిండు. ఆయనతో మనకేం పని. పార్టీ మనకు అండగున్నది. సర్కార్ సాయం జేస్తున్నది. ప్రజలు ఆదుకుంటున్నది. పార్టీ కోసం పనిచేద్దాం. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలుకు జైకొడుదాం. ఇక్కడ మన సత్తా ఏందో చూపెడుదాం.
సొంతింటికి అచ్చినట్టున్నది..
మొదట్నుంచి టీఆర్ఎస్లనే ఉన్న. 20 ఏండ్ల సంది పనిజేత్తన్న. ఈటలను ఆరుసార్లు గెలిపిచ్చినం. ఆయన బీజేపీలకు పోయిండు. కొంత సానుభూతితోటి మేం పోయినం. కానీ, అక్కడ ఉండలేక పోయినం. ఆ పార్టీల తిరగలేక పోయినం. మళ్ల ఇక్కడికే అచ్చినం. పార్టీలో చేరినం. ఇప్పుడు సొంతింటికి అచ్చినట్టున్నది. పార్టీ కోసం బాగా పనిజేత్తం. అందరినీ కలుపుకుపోతం. గెల్లు సీను గెలుపు కోసం కష్ట పడుతం. ఇక్కన్నుంచి భారీ మెజారిటీనిత్తం.
పనిచేసే ప్రభుత్వానికి అండగుంటం..
సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నడు. అన్ని వర్గాలను బాగా చూసుకుంటుండు. రైతులకు బీమా, రైతు బంధు పథకాలిచ్చిండు. రుణమాఫీ జేత్తండు. పింఛన్లిస్తండు. ఇట్లా సెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నయ్. పనిజేసేటోళ్ల వెంట ఉండాలనుకున్నం. పార్టీలో జేరినం. పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగుంటం. పార్టీని కాపాడుతం. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటం. మాతోటి పది మందికి జెప్తం. టీఆర్ఎస్కే ఓటేసేలా జేత్తం.