కరీంనగర్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ‘దళిత బంధు డబ్బులు జమైనయా? లేదా?, జమైన డబ్బులు తిరిగి తీసుకుంటారా?, ఏ సమయంలో లబ్ధిదారులు తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు’ అనే ప్రశ్నలను నివృత్తి చేసేందుకు పథకం పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని బ్యాంకుల్లో అధికారులు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు లబ్ధిదారులు అడుగుతున్న ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెబుతున్నారు. తమ ఖాతాల్లో జమైన డబ్బులు తీసుకోకుంటే తిరిగి తీసుకుంటారని జరుగుతున్న ప్రచారం వట్టి పుకార్లని బ్యాంకర్లు కొట్టి పారేస్తున్నారు. బ్యాంకులో ఒకసారి జమైన డబ్బు తిరిగి తీసుకోకపోవడమే కాకుండా అవి ఖాతాలో ఉన్నన్ని రోజులు వడ్డీ కూడా చెల్లిస్తామని వివరిస్తున్నారు. బ్యాంకర్ల సమాధానంతో లబ్ధిదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
జమ్మికుంట టీజీ బ్యాంకులో..
జమ్మికుంట పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దళితబంధు లబ్ధిదారుల సందేహాలు, అనుమానాల నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెసును ఏర్పాటు చేశారు. ఇల్లందకుంట మండలంలోని 15 గ్రామాలకు చెందిన 2,938 మందికి ఈ బ్యాంకులో ఖాతాలు తెరిచారు. దాదాపు అందరి ఖాతాల్లో డబ్బులు జమైనట్లు బ్యాంక్ సీనియర్ మేనేజర్ వేమూరి సాయికృష్ణ చెబుతున్నారు. ఇక్కడ ప్రారంభించిన హెల్డెస్క్కు దళితులు వచ్చి తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. హెల్ప్డెస్కులో ప్రత్యేకంగా ఒక సిబ్బందిని నియమించడమే కాకుండా స్వయంగా సీనియర్ మేనేజర్ సాయికృష్ణ కూడా లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెల్ప్డెస్క్ పని చేస్తుందని స్పష్టం చేస్తున్నారు.
పుకార్లు నమ్మవద్దు..
దళితబంధు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమైన వారందరికీ మెస్సేజ్ రూపంలో సమాచారం పంపిస్తున్నాం. ఒకసారి జమచేస్తే తిరిగి వెనకి పోవు. బయట జరిగే ప్రచారాలు, పుకార్లను నమ్మవద్దు. దళిత బంధు కింద లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ గ్రౌండింగ్కు కలెక్టర్ ఆదేశాల మేరకు డబ్బులు విడుదల చేస్తాం. డెయిరీ యూనిట్లు ఎంచుకున్న లబ్ధిదారులకు ముందుగా షెడ్ల నిర్మాణానికి రూ.లక్ష చొప్పున విడుదల చేస్తాం. మిగతా డబ్బు పాడి పశువులను కొనుగోలు చేసిన తర్వాతనే ఇస్తాం. మా బ్యాంకు హెల్ప్ డెసులో ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందిస్తాం.
ఎస్బీఐలో..
జమ్మికుంట పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన దళిత బంధు హెల్ప్ డెస్క్లో స్వయంగా మేనేజర్ పీ గోపీచంద్ లబ్ధిదారుల అనుమానాలను నివృత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ జమ్మికుంట రూరల్ గ్రామాలకు సంబంధించి 2,900 మంది లబ్ధిదారులకు ఖాతాలు తెరిచారు. బ్యాంక్కు వచ్చిన లబ్ధిదారుల వివరాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు వారితో మమేకమై సమాధానాలు చెబుతూ మన్ననలు పొందుతున్నారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలివీ..
ప్రశ్న: మీ బ్యాంకులో తెరిచిన దళితబంధు ఖాతాలెన్ని?
మేనేజర్ : ఇప్పటి వరకు 2,900 తెరిచాం.
ప్రశ్న : ఎంత మందికి డబ్బులు జమయ్యాయి?
మేనేజర్: తెరిచిన అన్ని ఖాతాల్లో జమయ్యాయి.
ప్రశ్న : జమైనట్లు లబ్ధిదారులకు సంక్షిప్త సమాచారం పంపారా?
మేనేజర్: అందరికీ పంపించాం.
ప్రశ్న: ఖాతాల్లో జమైన డబ్బులు తిరిగి వెనకి వెళ్లే అవకాశం ఉందా?
మేనేజర్: ఎట్టి పరిస్థితుల్లో వెనకి పోవు.
ప్రశ్న: వెనకి పోతాయని పుకార్లు వస్తున్నాయి, దాని పై మీరేం చర్య తీసుకుంటున్నారు?
మేనేజర్: అలాంటి పుకార్లు నమ్మవద్దు. బ్యాంకులో దళితబంధు లబ్ధిదారులకు సందేహాల నివృత్తికి ప్రత్యేక హెల్ప్ డెస్ ఏర్పాటు చేశాం.
ప్రశ్న: దళితబంధు డబ్బులకు వడ్డీ వస్తుందా?
మేనేజర్: ప్రతి నెలా జమవుతుంది.
ప్రశ్న: దళిత బంధు డబ్బులు డ్రా చేసుకోవచ్చా?
మేనేజర్ : లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ల గ్రౌండింగ్ సమయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు విడుదల చేస్తాం. లబ్ధిదారులకు మెరుగైన సేవలందించడానికి జమ్మికుంట ఎస్బీఐ ముందుంటుంది.