మెట్పల్లి, మే 28 : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నది. ఆధునిక పరికరాలు.. సకల వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నది. ఇందుకు మెట్పల్లి సర్కారు దవాఖానే నిదర్శనం. సాధారణ ప్రసవాల్లో రాష్ట్రంలోనే ఐదో స్థానంలో ఉన్న ఈ 50 పడకల దవాఖానను మరింత అభివృద్ధి చేసేందుకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కృషితో రూ.3.60 కోట్లు మంజూరవగా త్వరలో వైద్యశాల రూపురేఖలు మారనున్నాయి.
ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. దవాఖానల అభివృద్ధి కోసం నిధుల కేటాయింపులో సముచిత స్థానం కల్పిస్తున్నది. అందుకు మెట్పల్లి సామాజిక వైద్యశాల (సీహెచ్సీ)యే నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం 50 పడకల స్థాయి కలిగిన ఈ సామాజిక వైద్యశాల దినదినం అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ జరుగుతున్న ప్రసవాలు, వైద్యసేవలు ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి. ప్రసవాలలోనే కాదు, హెర్నియా, హైడ్రోసిల్, అపెండిసైటిస్, గర్భ సంచికి సంబంధించి శస్త్ర చికిత్స, తదితర వైద్యచికిత్సలతో ప్రజల ఆదరణను మరింతగా తన వైపు ఆకర్షింప జేస్తున్నది. ప్రతి రోజూ 250 నుంచి 300కు పైగా ఓపీ నమోదు అవుతున్నది. మెట్పల్లి సర్కారు దవాఖానలో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఆయా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ప్రతి సోమ, గురు, శనివారం హెర్నియా, హైడ్రోసిల్, అపెండిసైటిస్, గర్భసంచి శస్త్రచికిత్స చేస్తారు. ఇప్పటివరకు హెర్నియా 3, హైడ్రోసిల్ 6, అపెండిసైటిస్ 3 శస్త్రచికిత్సలు నిర్వహించారు.
దవాఖానల అభివృద్ధికి ప్రత్యేక కృషి
ప్రతి నియోజకవర్గం కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కోరుట్ల నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి మంజూరవగా, ఇటీవల రూ.20 కోట్ల మేర నిధులు విడుదల చేసింది. అదే విధంగా మెట్పల్లిలో 50 పడకల దవాఖానను అభివృద్ధి చేసేందుకు రూ.3.60 కోట్లు నిధులు విడుదల చేసింది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించారు. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇటీవల వైద్యవిధాన పరిషత్ కమిషనర్ను కలిసి స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్యే కోరగానే ఆ వెంటనే ఆరుగురు స్టాఫ్ నర్సులను జగిత్యాల జిల్లా దవాఖాన నుంచి డిప్యుటేషన్ మీద ఇక్కడికి బదిలీ చేశారు.
డయాలసిస్ సెంటర్ !
కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కోరుట్ల నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ మంజూరైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటనకు వచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కలిసి కోరుట్ల నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో మంత్రి హరీశ్ రావు వెంటనే స్పందించారు. హామీ ఇచ్చి వారం గడవక ముందే కోరుట్ల సీహెచ్సీకు డయాలసిస్ సెంటర్తో పాటు అందుకు అవసరమైన యంత్రాలను మంజూరు చేస్తూ ఆ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోరుట్ల లేదా మెట్పల్లిలో త్వరలో దీనిని ప్రారంభించేందుకు సంబంధిత అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల కోరుట్ల, మెట్పల్లి పట్టణాలు, మల్లాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, కోరుట్ల మండలాలతో పాటు పరిసరాలలో ఉన్న నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లోని అనేక మండలాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎంతో సౌకర్యంగా ఉండనుంది.
ప్రసవాల్లో టాప్..
ప్రసవాల సంఖ్యలో రాష్ట్రంలో 50 పడకల దవా ఖానల్లో టాప్5లో ఒకటిగా ప్రతి ఏటా మెట్పల్లి సామాజిక వైద్యశాల స్థానం పొందుతున్నది. మెట్పల్లి పట్టణం, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాలతో పాటు కోరుట్ల, నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, భీంగల్, నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రుద్రంగి, చందుర్తి మండలాల్లోని పలు గ్రామాల నుంచి గర్భిణులు ప్రసవాల కోసం ఇక్కడికి వస్తుంటారు. అదే విధంగా జనవరి1, 2022 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆసుపత్రిలో 651 ప్రసవాలు జరిగాయి. అందులో సాధారణ ప్రసవాలు 177 కాగా, 474 సిజేరియన్ ద్వారా ప్రసవాలు జరిగాయి.
అయితే సిజేరియన్ ప్రసవాలను తగ్గించి సాధారణ ప్రసవాలకే ఎక్కువగా ప్రాధాన్యతను కల్పించేందుకు ఇక్కడి వైద్యులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. గర్భిణులు, వారి వెంట వచ్చే కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెంపునకు కేసీఆర్ కిట్లు, అమ్మఒడి వాహనం, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే 12 వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందివ్వడం మరింత ఊతం ఇస్తున్నది. కాగా ఈ ఏడాది జనవరిలో 42 సాధారణ ప్రసవాలు, 99 సిజేరియన్లు ఫిబ్రవరిలో 43 సాధారణ ప్రసవాలు, 122 సిజేరియన్లు, మార్చిలో 50 సాధారణ ప్ర సవాలు, 112 సిజేరియన్లు, ఏప్రిల్ 42 సాధారణ ప్రసవాలు, 141 సిజేరియన్లు అయ్యాయి.
వైద్యులు వీరే…
ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చొరవతో ప్రస్తుతం దవాఖానలో వైద్యులు, సిబ్బంది కొ రత పెద్దగా లేదు. పలు విభాగాల వైద్యులు ఇక్క డ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం దవాఖానలో 12 మంది వైద్యులున్నారు. వీరిలో సివిల్ సర్జన్ డా.అమరేశ్వర్, జనరల్ సర్జన్ డా. పెంచలయ్య, డెంటల్ సర్జన్ డా.సాజిద్ అహ్మ ద్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, పిల్లల వైద్యులు డా.రాజేశ్వర్, డా.శిల్ప, గైనకాలజిస్టులు డా.మాధవి, డా. సబిత, డా.శ్రీజ, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఎముకల వైద్యులు డా.ప్రవీణ్, అనస్తీషియన్లు డా.సాయిక్రిష్ణ, డా.ఫాజల్ అహ్మద్, అదే విధం గా ఎంబీబీఎస్ వైద్యులు డా.ఉదయ్ ఉన్నారు.
ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం
ప్రతి ఒక్కరికీ ఉచితంగా మెరుగైన ప్రభుత్వ వైద్యసేవలు అందాలి. ప్రైవేటుకు దీటుగా అన్ని వసతులతో సర్కారు దవాఖానలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. కోరుట్ల, మెట్పల్లిలోని ప్రభుత్వ దవాఖానాల అభివృద్ధికి ఇటీవల నిధులు విడుదలయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. రూ.3.60 కోట్లతో మెట్పల్లి సామాజిక వైద్యశాల పాత భవనం స్థానంలో మూడంతస్తుల అధునాతనమైన భవన నిర్మాణం చేపడతాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ దవాఖాన రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నా. కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కోసం ఇటీవల మంత్రి హరీశ్రావును కోరిన వెంటనే మంజూరు చేయడం సంతోషంగా ఉంది. డయాలసిస్ సెంటర్ను త్వరలోనే ప్రారంభించి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుబాటులోకి తేస్తాం.
– కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎమ్మెల్యే, కోరుట్ల