కమాన్చౌరస్తా, మే 28: జిల్లా కేంద్రంలోని జవహర్ బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులకు మంచి ఆదరణ లభిస్తున్నది. అంబేద్కర్ స్టేడియంలో సంగీతం, జానపద నృత్యం, చిత్రలేఖనం, తబలా, క్రాఫ్ట్ అంశాల్లో తర్ఫీదు ఇస్తుండగా, చిన్నారులు ఉత్సాహంగా హాజరవుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 450 మంది దరఖాస్తు చేసుకుని శిక్షణ పొందుతున్నారు. కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించగా, ప్రస్తుతం అంబేద్కర్ స్టేడియంలోని ప్రత్యేక గదుల్లో శిక్షణ ఇస్తున్నారు. వేసవి సెలవులను చిన్నారులు తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు వినియోగించుకుంటున్నారు. చదువుతోపాటు భవిష్యత్తులో ఇతర రంగాల్లోనూ రాణించేలా సన్నద్ధమవుతున్నారు.
మంచి స్పందన వస్తున్నది
ఏప్రిల్ 25న ప్రారంభమైన శిక్షణ తరగతులు జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు నేరుగా అంబేద్కర్ స్టేడియంలోని మా కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో చిన్నారులు పలు అంశాల్లో శిక్షణ కోసం హాజరవుతున్నారు. వారిలో కళలపై ఆసక్తి పెరిగేలా ప్రోత్సహి స్తున్నాం. తల్లిదండ్రులు చిన్నారుల శిక్షణ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– కే మంజులాదేవి, సంగీత శిక్షకురాలు, బాల భవన్ సూపరింటెండెంట్
డ్యాన్స్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..
డ్యాన్స్ శిక్షణ అంటే పెద్ద సంఖ్యలో చిన్నారులు హాజరవుతున్నారు. ఇక్కడికి వచ్చే వారికి కొంచెం సమయం ఎక్కువ తీసుకుని రెండు, మూడు బ్యాచ్లుగా చేసి శిక్షణ ఇస్తున్నాం. ఫోక్ సాంగ్స్పై శిక్షణకు ఎక్కువ మంది చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. వారి ఆసక్తికి తగినట్లు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే రెండు మూడు పాటల్లో శిక్షణ పూర్తి చేశాం.
– సంగెం రాధాకృష్ణ, డ్యాన్స్ మాస్టర్