కార్పొరేషన్, మే 28: నగరంలో పందులను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని మేయర్ యాదగిరి సునీల్రావు పెంపకందారులకు సూచించారు. సప్తగిరికాలనీలోని నగరపాలక సంస్థ వాహనాల షెడ్డులో శనివారం ఆయన నగరంలోని పందుల పెంపకందారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో పందుల స్వైర విహారంపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ చట్టం, నిబంధనల ప్రకారం పందుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పందుల ద్వారా కలిగే అపరిశుభ్రతతో వ్యాప్తి చెందే వ్యాధులను వివరించారు.
ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నివాస ప్రాంతాలకు దూరంగా పందులను పెంచాలని సూచించారు. పందుల పెంపకందారుల డిమాండ్లను నగరపాలక సంస్థ ద్వారా పరిషరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సహకారంతో నగరానికి దూరంగా పందుల పెంపకానికి స్థలాలను కేటాయిస్తామన్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బల్దియా ద్వారా షెడ్ల నిర్మాణం, చుట్టూ ఫెన్సింగ్, నీరు, లైటింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. డివిజన్ల వారీగా పందులను పెంచే వారికి మాత్రమే ఈ స్థలాలను కేటాయిస్తామని స్పష్టం చేశారు.
డంప్ యార్డు సమస్యను పరిష్కరిస్తాం
నగరంలో డంప్ యార్డు సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని మేయర్ వై సునీల్రావు తెలిపారు. నగరంలోని డంప్ యార్డు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులు, క్రీడా మైదానాల స్థలాలను ఆయన మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, డంప్ యార్డుకు సంబంధించి బయోమైనింగ్ పనులు దక్కించుకున్న సంస్థ ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించిన మెషినరీ సిద్ధం చేశారన్నారు. రెండు, మూడు రోజుల్లో పనులను ప్రారంభించి, 6 నుంచి 9 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం ఈ స్థలాన్ని మానేరు రివర్ ఫ్రంట్కు అనుగుణంగా సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ప్రస్తుతం డంప్ యార్డులో మంటలను కూడా అదుపులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే, రూ. 50 కోట్లతో మరో ప్రాంతంలో రోజు వారి చెత్తను క్లీనింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జూన్ 2 నాటికి క్రీడా మైదానాలను సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. నగరంలో స్మార్ట్సిటీలో భాగంగా పటిష్టమైన నిఘా పెట్టేందుకు చేపడుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయన్నారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, ఐలేందర్ యాదవ్, వాల రమణరావు, కుర్ర తిరుపతి, గంట కల్యాణి-శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ త్రయంభకేశ్వర్, మున్సిపల్ వెటర్నరీ అధికారి డాక్టర్ సల్వాజీ శ్రీధర్, శానిటేషన్ సూపర్ వైజర్ రాజమనోహర్, నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.