రాంనగర్, మే 28: రాష్ట్రంలోని వివిధ స్థాయిల పోలీసు అధికారులు పోటీతత్వంతో పని చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, వివిధ విభాగాల అధికారులతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, వివిధ విభాగాల పోలీసులు సమర్థవంతంగా పని చేయడం ద్వారానే ఆశించిన ఫలితాలు వస్తున్నాయన్నారు. పోలీస్ శాఖలోని ప్రతి విభాగం పనితీరులో మరింత నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఫిర్యాదుల పరిషారానికి ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. వివిధ రకాల కేసుల్లో పెండింగ్లో ఉన్న నివేదికలను త్వరగా తెప్పించుకొని న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టాలని సూచించారు. టెక్నాలజీ వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆదేశించారు.
ఆదర్శం కరీంనగర్ కమిషనరేట్
కరీంనగర్ కమిషనరేట్లోని అన్ని స్థాయిల పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని డీజీపీ మహేందర్రెడ్డి అభినందించారు. నేరాల నియంత్రణ, ఛేదనలో పోటీతత్వంతో పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, జీ చంద్రమోహన్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, సత్యనారాయణ, మదన్లాల్, కాశయ్య, ప్రతాప్, ఎస్బీఐ జీ వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.