బండి విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు : మంత్రి గంగుల మండిపాటు
ఎంపీగా విఫలమై చిచ్చు పెట్టే ప్రయత్నం : ఎంఐఎం కరీంనగర్ జిల్లా ఇన్చార్జి అహ్మద్ విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు : కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరేందర్రెడ్డి
యాత్ర విఫలం నుంచి తప్పించుకోవడానికే కుటిల మాటలంటున్న నిపుణులు
మూడేళ్లలో ఎంపీగా ఏం చేశారో ఒక్క మాటా చెప్పని వైనం
కరీంనగర్, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విషం కక్కారు. ప్రశాంత కరీంనగర్లో కులమతాల మధ్య చిచ్చు పెట్టేవిధంగా రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఈసారి మరో అడుగు ముందుకు వేసి ఆచరణ సాధ్యం కాని, వింత వాగ్దానాలు చేశారు. హిందూ ఏక్తాయాత్ర సందర్భంగా ఈ నెల 25న ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.. ఆసలు యాత్ర విఫలమైన విషయాన్ని పక్కదారి పట్టించేందుకే.. సంజయ్ విషం కక్కారని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఏక్తాయాత్ర సందర్భంగా చేసిన ప్రసంగంలో గడిచిన మూడేళ్లలో ఆయన కరీంనగర్లో ఏం అభివృద్ధి చేశారో ఒక్క మాట కూడా చెప్పకపోవడం.. ప్రసంగమంతా మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. –
తన స్వార్థం కోసం లేని సమస్యను సృష్టించడం.. వాటికి మతం రంగు పూసి స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకోవడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు వెన్నతో పెట్టిన విద్యే. ఈసారి మరింత రెచ్చిపోయారు. ఈ నెల 25న కరీంనగర్లో హిందూ ఏక్తాయాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన ప్రసంగించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసురుతున్నా అంటూ.. “తెలంగాణలో ఉన్న మసీదులను తవ్వి చూద్దాం.. శవాలొస్తే మీవి.. శివం వస్తే మావి’. అందుకు మీరు సిద్ధమా?’ అంటూ మాట్లాడారు. అక్కడితో ఆగకుండా బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలు, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని, అధికారిక భాషగా ఉన్న ఉర్దూను శాశ్వతంగా నిషేధిస్తామంటూ వాగ్దానాలు చేశారు. అతి త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా రాబోతుందంటూ చెప్పుకొచ్చారు. నిర్వహించిన ఏక్తాయాత్రకు.. ఆయన చేసిన ప్రసంగానికి ఏమాత్రం పొంతన లేకుండా మాట్లాడారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకవైపు విద్వేషపు మాటలు మాట్లాడుతూనే.. మరోవైపు తనను మూడుసార్లు చంపే ప్రయత్నం చేసినా కాషాయ జెండాను వీడలేదంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు.
దృష్టిని మరల్చడానికే..
నిజానికి ఏక్తాయాత్ర అనుకున్న స్థాయిలో జరగలేదని బీజేపీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంతో పోల్చితే యాత్రకు వచ్చిన వారి సంఖ్య కూడా భారీగా తగ్గిందన్న వాదనలే వినిపిస్తున్నాయి. అయితే.. ఈసారి ఏక్తాయాత్రను భారీ స్థాయిలో నిర్వహించాలని బండి భావించారు. ఇందుకోసం రెండు మూడు రోజులుగా కరీంనగర్లోనే మకాంవేసి.. ఆయన స్వయంగా ఏర్పాట్లు చేశారు. వారి అంచనాల ప్రకారం కనీసం 20 నుంచి 25 వేల మంది వస్తారని అంచనా వేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, యాత్ర ప్రా రంభం నుంచి చివరి వరకు చూస్తే.. వారి అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి.
దీంతో తాను ప్రాతినిధ్యం వహించే కరీంనగర్ గడ్డపైనే యాత్ర విఫలమైందన్న సంకేతాలు బయటకు వెళ్తే బాగుండదని భావించిన సంజయ్.. ప్రజలు, పార్టీల దృష్టి ని మరల్చడానికి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆపార్టీలోనే చర్చ జరుగుతోంది. యాత్ర విఫలం కావడానికి కారణాలను ఇతరులపై నెట్టే అవకాశం కూడా సంజయ్కు లేకుండా పోయిం ది. ఎందుకంటే.. ఆయన రెండు రోజులు స్థానికంగా మకాం వేసి స్వయంగా పర్యవేక్షణ చేశారు. అయినా, వారి అంచనాలు పూర్తిగా తలకిందులు కావడంతో ప్రస్టేషన్లో సంజయ్ ఇస్టానుసా రం మాట్లాడారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
పచ్చి అబద్ధాలు
తనను మూడుసార్లు చంపే ప్రయత్నం చేసినా కాషాయ జెండాను వీడలేదంటూ బండి సంజయ్ యాత్రలో సెంటిమెంట్ డైలాగ్ కొట్టారు. నిజంగానే చంపే ప్రయత్నం జరిగితే.. గత ఎనిమిదేళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. నిజానిజాలు బయటకు తీయమని కేంద్రా న్ని ఎందుకు కోరలేదు?. పలుసార్లు సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను పిలిపించుకొని మీటింగ్లు పెట్టుకున్నారు.. ఆ సమయంలో ఈ ప్రస్తావన తెచ్చి హత్యాప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎందుకు విన్నవించలేదు?. మూడుసార్లు హత్యాప్రయత్నం జరిగితే.. ఏ సమయంలో ఎప్పుడు జరిగింది..? ఎందుకు జరిగింది..? ఎక్కడ జరిగింది..? ఎవరు చేశారు..? అన్న వివరాలను ఏక్తాయాత్రలో ఎందుకు విప్పి చెప్పలేదు? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
సెంటిమెంట్ కోసం బండి పచ్చి అబద్ధాలు ఆడుతారని, ఇందుకు నిదర్శనమే హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పుకోవడం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే.. మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ మరో వింత వాగ్దానం చేశారు. అదే నిజమైతే.. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వాలే రాజ్యమేలుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మైనార్టీ రిజర్వేషన్లు ఎక్కడైనా రద్దు చేశారా?. వాటిని రద్దుచేసి ఇతర కులాలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అన్న ప్రశ్నలకు బండి ఏం సమాధానం చెపుతారన్న ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. స్వార్థ పూరిత రాజకీయాల కోసం.. రెచ్చగొట్టే మాటలే కాదు.. ఎలాంటి వాగ్దానాలైనా చేస్తారని చెప్పడానికి బుధవారం బండి సంజయ్ మాటలే నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి.
మూడేళ్లలో ఏం చేశారో చెప్పలేదే..
“కరీంనగర్కు పాదాభివందనాలు.. గెలిపించిన ప్రజలకు శత కోటి వందనాలు” అంటూ మాట్లాడారే.. తప్ప గెలిపించిన ప్రజల కోసం మూడేళ్లుగా ఈ నియోజకవర్గానికి ఏం చేశారో ఒక్క మాటా చెప్పలేదు. భవిష్యత్లో ఇది చేస్తానని చెప్ప లేదు. కేంద్రం నుంచి కరీంనగర్ కోసం ప్రత్యేకంగా ఇది తెస్తామని వాగ్దానం ఇవ్వలేదు. సహజంగా ఒక సమావేశం జరిగితే.. ముందుగా ఆయన తన నియోజకవర్గానికి మూడేళ్ల ఎంపీ పదవీ కాలంలో ఏం చేశారో చెప్పాలి. భవిష్యత్లో ఏం చేస్తారో వివరించాలి. అందుకోసం వారి వద్ద ఉన్న ప్రణాళికలు ఏంటో.. వాటి ద్వారా జరిగే ప్రయోజనాలు ఏంటో.. నియోజకవర్గానికి ఎలా మేలు చేకూరుతుందో వివరించాలి. కానీ.. తన ప్రసంగం మొత్తంలో ఒక్కటంటే ఒక్కటీ మాట్లాడలేదు.
భగ్గుమన్న పార్టీలు
ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై అన్ని రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ గడ్డపై నుంచి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించాయి. అయన సొంత గడ్డ అన్న సోయి లేకుండా మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే.. ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అభివృద్ధిని మాత్రమే కోరుకుంటుందని విధ్వంసాలు కావని, బండి తన రాజకీయాల కోసం విషపూరిత మాటలు మాట్లాడవద్దని మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే, ఎంఐఎంతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సంజయ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.