కరీంనగర్, మే 26 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆవిష్కరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 4,687.92 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ఆవిషరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, వాణిజ్యం, విద్య, గృహ రుణాలు, మౌలిక సదుపాయాల పునరుత్పాదక రంగాలకు రూ. 4,423.92 కోట్లు, ప్రాధాన్యత లేని రంగాలకు రూ. 264 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమివ్వడం జరిగిందని, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రుణాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. పంట ఉత్పత్తి, నిర్వహణ, మారెటింగ్ కోసం 2,04,641 మంది రైతులకు రూ. 2,193.54 కోట్ల మేరకు రుణాలు ఇవ్వనున్నట్లు, వ్యవసాయానికి టర్మ్ రుణాల కింద 15,511 మందికి రూ. 327.31 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు సంబంధించి 9,558 మంది రైతులకు రూ.188.60 కోట్లు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు 972 మంది రైతులకు రూ. 74.35 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలకు 3,372 మంది రైతులకు రూ. 471.81 కోట్లు, సూక్ష్మ సంస్థలకు 18,063 యూనిట్లకు రూ. 361.25 కోట్లు, చిన్న సంస్థలకు 13.273 యూనిట్లకు రూ. 597.50 కోట్లు, మధ్యతరగతి సంస్థలకు 101 యూనిట్లకు రూ. 33.75 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
విద్యా రుణాల కింద 553 మందికి రూ. 27 కోట్లు, గృహ రుణాల కింద 1,299 మందికి రూ.129.15 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాల కోసం 418 యూనిట్లకు రూ. 16.50 కోట్లు, పునరుత్పాదక శక్తి కింద 173 యూనిట్లకు రూ. 3.16 కోట్లు, ఇతర ప్రాధాన్యత లేని రంగాలకు 4,423 మందికి రూ. 264 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. ఆయా రంగాలకు కేటాయించిన రుణాలు త్వరగా మంజూరు చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ టీవీ సీతారామాంజనేయులు, నాబార్డ్ ఏజీఎం పీ అనంత్, డీఆర్డీవో ఎల్ శ్రీలతా రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్కుమార్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మనోహర్ రావు, ఏడీఏ అంజనీ, బ్యాంకర్లు పాల్గొన్నారు.