రామకృష్ణాపూర్, మే 24: సింగరేణి తల్లి గర్భం నుంచి ఉద్భవించిన ఊరు రామకృష్ణాపూర్. ఒకప్పుడు ఆర్కే1, ఆర్కే2, ఆర్కే3, ఆర్కే4, ఎంకే 4, ఎంకే 4ఏ, ఏరియా వర్క్షాపు, స్టోర్, టింబర్ యార్డు, గ్యారేజీ, గనుల్లో పని చేసే కార్మికులు, వారి కు టుంబాలతో రామకృష్ణాపూర్ పట్టణం నిత్య కల్యాణం పచ్చతోరణంగా విలసిల్లింది. ఈ పట్టణం వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి రాజకీయాలు నడిచేవి అంటే అతిశయోక్తి కాదు.
కార్పొరేట్ని వణికించిన సత్తా ఉన్న లీడర్లు ఈ పట్టణం వారే. కానీ ఇదం తా గతం. కాలక్రమేణా మూతబడిన గనులతో రామకృష్ణాపూర్ పట్టణ ప్రాముఖ్యత దిగజారింది. చరిత్ర మసకబారి పోయింది. ప్రాముఖ్యత కోల్పోయిన పట్టణం నుంచి సింగరేణిలో రిటైర్డ్ అయిన వలస కార్మికులు సొంత ఊర్లకు తిరిగి వెళ్లడం, మంచిర్యాల పట్టణానికి చేరువలో ఉండాలనే ఉద్దేశంతో మంచిర్యాల, తిమ్మాపూర్, గద్దెరాగడి, క్యాతనపల్లిలో స్థిరపడేందుకు అప్పులు చేసి ఇండ్లు కట్టుకుంటున్నారు. అందుకే నానాటికీ దిగ జారుతున్న పట్టణ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ రామకృష్ణాపూర్ ‘పట్టణ అస్తిత్వం.. పట్టణ పునర్జీవం’ పేరుతో గొప్ప యజ్ఞానికి పూనుకున్నారు.
రామకృష్ణాపూర్ పట్టణానికి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పునర్జీవం పోసేందుకు 1400 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఐదు దశాబ్దాల క్రితం సింగరేణి తల్లి గర్భం నుంచి పురుడు పోసుకున్నదే రామకృష్ణాపూర్ పట్టణం. 1964లో ఆర్కే1 భూగర్భగని ఏర్పాటుతో రామకృష్ణాపూర్ పట్టణానికి అస్తిత్వం ప్రారంభమైంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం బొగ్గు బాయి పనికి వచ్చిన కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చిన ఊరు ఇది. రామకృష్ణాపూర్, క్యాతనపల్లి తెలంగాణ ఏర్పాటుకు ముందు క్యాతనపల్లి మేజర్ పంచాయతీగా ఉండేది. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2018, ఆగస్టు 2న మున్సిపాలిటీగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీని అస్తిత్వం మూడు విధాలా నేపథ్యం కలిగి ఉంటుంది.
అమరవాది, శేషుపల్లి పూర్తి విలేజీ వాతావరణంతో, గద్దెరాగడి, తిమ్మాపూర్ పూర్తి అర్బన్ వాతావరణం, రామకృష్ణాపూర్ ఇటు పట్టణ ప్రాంతం కాదు, గ్రామీణ ప్రాంత కాకుండా ఉంటాయి. దీంతో సింగరేణి కార్మిక కుటుంబాలు 50 ఏండ్లుగా పక్కా ఇండ్లు నిర్మించుకోలేక, రేకుల షెడ్లలో ఉండలేక ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇది చూసిన కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇక్కడి ప్రజలకు తెలంగాణ ఏర్పాటు అయ్యాక సింగరేణి ప్రాంతంలో సొంతంగా నిర్మించుకున్న ప్రతి ఇంటికీ పట్టాలు ఇప్పిస్తానని శ్రీరాంపూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు.
రామకృష్ణాపూర్ పట్టణంలో 3 వేల మంది ఇండ్లకు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంటి కొలతలను బట్టి మందమర్రి తహసీల్దార్ పేరున తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో డీడీలు కట్టి తహసీల్ కార్యాలయంలో దరఖాస్తులు అందించారు. వీటిలో 800 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయని మందమర్రి తహసీల్దార్ తెలిపారు. 2200 మంది ఇండ్ల పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీటిలో ఇప్పటివరకు సుమారు 1400 ఇండ్లకు రిజిస్ర్టేషన్లు జరిగాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రెండేండ్ల క్రితం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ 100 గజాల్లోపు స్థలం కలిగిన 12 మంది నిరుపేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ సూపర్ బజార్ ఏరియాలో బుధవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకర్రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ నిరుపేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. రామకృష్ణాపూర్ పట్టణ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకకాలంలో 1400 మందికిపైగా పట్టాలు అందజేయనున్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులు సకాలంలో రావాలని పలువురు నాయకులు కోరుతున్నారు.