హరితహారం ఎనిమిదో విడుత కోసం ఏర్పాట్లు
మండలంలో 18 నర్సరీల్లో సిద్ధంగా 2.25లక్షల మొక్కలు
ఇల్లందకుంట, మే 22 : తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఎనిమిదో విడుతకు సర్వం సిద్ధమవుతున్నది. మండలంలో ఇప్పటికే ఏడు విడుతల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటగా, ఈ ఏడాది భారీ లక్ష్యంతో అధికార యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీల్లో 2.25 లక్షల మొక్కల పెంపకం చేపట్టగా, వాటి సంరక్షణ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది.
మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏటా హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. పంచాయతీల్లో ఖాళీ స్థలాలతోపాటు, ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు లక్ష్యం విధించి అధికారులతోపాటు ప్రజలను కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నది. ఊరూరా నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నది.
18 నర్సరీలు.. 2.25 లక్షల మొక్కలు
గతేడాది ఏడో విడుతలో భాగంగా మండలంలోని 18 గ్రామాల పరిధిలో లక్షా 56 వేల మొక్కలను నాటారు. ఈ ఏడాది ఎనిమిదో విడుతలో ప్రతి గ్రామానికి 12,500 చొప్పున మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిన క్రమంలో గ్రామాల్లోని నర్సరీల్లో 2.25 లక్షల మొక్కలు సిద్ధం చేస్తున్నారు. అలాగే లక్ష్యాన్ని చేరుకునేందుకు రైతులు, ప్రజలకు మొక్కల పెంపకంతో కలిగే ప్రయోజనాలపై అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూములతో పాటు అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రహదారికి రెండు వైపులా మొక్కలు నాటనున్నారు.
హరితహారం విజయవంతానికి కృషి
మండలంలో హరితహారం ఎనిమిదో విడుత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాం. మండలంలోని 18 గ్రామాల్లో 18 నర్సరీల్లో మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. హరితహారం ఏర్పాట్లపై గ్రామ స్ధాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
-ఎంపీడీవో విజయలక్ష్మి
అందరూ భాగస్వాములు కావాలి
ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలి. మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలి. గ్రామంలో హరితహారం ఎనిమిదో విడుత కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నం. చెట్ల వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి, మొక్కలను ఎక్కువగా నాటేలా అవగాహన కల్పిస్తున్నం. ప్రతి ఇంటి ఆవరణలో పెంచుకునేలా ప్రోత్సహిస్తున్నం.
-మట్ట రజితావాసుదేవరెడ్డి, కనగర్తి సర్పంచ్