మల్యాల, మే 22: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు జరిగే వేడుకలు 25న జయంతి రోజున పూర్ణాహుతితో ముగియనున్నాయి. వైశాఖ బహుళ దశమి రోజున ఏటా కొండగట్టులో హన్మాన్ పెద్ద జయంతి నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ వైశాఖ బహుళ దశమి రోజైన 25న హన్మాన్ పెద్ద జయంతిని ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యాగశాలలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞాన్ని జరిపిస్తారు.
ఉత్సవాలకు అంకురార్పణ
పెద్దజయంతి సందర్భంగా అంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం యాగశాల శుద్ధి చేసి పుణ్యాహవచనం చేసి ఉత్సవాలకు అంకురార్పన చేసి అఖండ దీప స్థాపన చేశారు. ఉదయం స్వస్తిక్ వచనం, రక్షాబంధనం, రుత్విక్ వరుణం, అరుణి మథనం, దేవతాహ్వానం, ఉత్సవ మూర్తుల యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతారాధన, అగ్నిప్రతిష్ఠ, హవనం, స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు స్థాపిత దేవతారాధన, బలిహరణం, సుందరాకాండ పారాయణం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు.
అంజన్నకు రాములోరి పట్టువస్ర్తాలు
హన్మాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాల నుంచి నూతన పట్టు వస్ర్తాలను కానుకగా పంపిస్తున్నారు.
తరలిరానున్న లక్షలాది మంది అంజన్న దీక్షాపరులు
జయంతి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ నుంచి లక్షలాది మంది ఆంజనేయ స్వామి దీక్షాపరులు కాలినడక, ఇతర మార్గాల్లో కొండగట్టుకు తరలివస్తారు. అత్యంత నిష్ఠతో ఆచరించిన మండల(41), అర్దమండల(21), ఏకాదశ(11)రోజుల దీక్షలను స్వామి సన్నిధిలో విరమించి, అంజన్నకు మొక్కులు చెల్లించుకుని తిరిగి వెళ్తారు.
ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
లక్షలాదిగా తరలివచ్చే అంజనేయ స్వామి దీక్షాపరులు, భక్తుల కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. హన్మాన్ చిన్న జయంతికి ఏర్పాటుచేసిన బారికేడ్లు, క్యూ లైన్ల నిర్మాణం, చలువ పందిళ్లు, చలివేంద్రాల్లో చిన్న చిన్న మార్పులతోపాటు అదనపు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి విద్యుత్ దీపాలు, ఆలయ ఆవరణలో లైటింగ్, సౌండ్ సిస్టం, ఎమర్జెనీ వినియోగానికి 10 జనరేటర్లను సైతం సిద్ధంగా ఉంచారు. వై జంక్షన్ నుంచి నాచుపెల్లి మార్గంలోని బొజ్జపోతన్న వరకు శాశ్వతంగా ఎల్ఈడీ లైట్లను అమర్చారు. 30 ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఈ సారి శుద్ధిచేసిన జలాలతో 5 మొబైల్ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. 75 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. ఉత్సవాల సందర్భంగా పారిశుధ్య నిర్వహణకు జగిత్యాల డీపీవో అదనపు సిబ్బందిని సమకూర్చారు. గుట్ట మీద, వాహన పూజల షెడ్డు వద్ద, వై జంక్షన్ వద్ద, గుట్ట కింద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. నూతన పుష్కరిణి వద్ద మహిళలకు దుస్తులు మార్చుకునేందుకుగాను గదులను నిర్మించారు. ఉత్సవాలకు వచ్చే దీక్షాపరులు, భక్తుల కోసం ఆలయ అధికారులు ముందుస్తుగానే 3.20 లక్షల లడ్డూలను తయారుచేసి పెట్టారు.
50 సీసీ కెమెరాలతో నిఘా
పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా 73 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. దేవాలయం తరపున ఆలయం లోపల, వెలుపల అమర్చిన 23 సీసీ కెమెరాలకు అదనంగా 50 సిసి కెమెరాలను అమర్చారు. పోలీస్ ఔట్ పోస్టులో కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి 73 సీసీ కెమెరాలను కంట్రోల్ రూముకు అనుసంధానం చేశారు. ఆలయంలో, పోలీస్ ఔట్ పోస్టు వద్ద డీవీఆర్లను ఏర్పాటు చేశారు.
21 నుంచి 26దాకా ఆర్జిత సేవలు బంద్
జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 26 వరకు జయంతి ముగిసేదాకా ఆలయంలో అభిషేకాలు, వాహనపూజలు, సత్యనారాయణవ్రతాల వంటి ఆర్జిత సేవలను నిలిపి వేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశ్ తెలిపారు.
పెద్ద జయంతికి ఏర్పాట్లు పూర్తి
కొండగట్టులో నేటి నుంచి నిర్వహించే జయంతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఏప్రిల్లో ఆలయంలో నిర్వహించిన చిన్న జయంతికి చేసిన ఏర్పాట్లకు తోడు అదనంగా క్యూలైన్లు, మాల విరమణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. పలు ప్రాంతాల్లో ఎల్ఈడీలు ఏర్పాటు చేశాం. ఎండలతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– ఈవో వెంకటేశ్