మేడిపల్లి, మే 22: ఏడేండ్ల క్రితం తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది..నాటి నుంచి తండ్రి జాడలేదు..వారి ఇద్దరి పిల్లలు దిక్కుతోచనిస్థితిలో చిక్కుకున్నారు..ఏడేండ్లుగా అమ్మమ్మే పెద్దదిక్కుగా మారి వారిని సాదుతున్నది. అయితే వయోభారంతో సతమతమవుతున్న ఆమె వీరి పోషణ కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నది. మండలంలోని కల్వకోట గ్రామానికి చెందిన కుంట భూమయ్య, వజ్రమ్మ దంపతుల కూతురు సుజాతకు 21 ఏండ్ల క్రితం కోరుట్ల మండలం మాదాపూర్కు చెందిన బుర్ర గంగారాంతో వివాహం చేశారు. వీరికి ఇద్దరు కూతుళ్లు యోగేశ్వరి, నాగేశ్వరి, కుమారుడు కాశీకేతన్ ఉన్నారు. గంగారాం తాగుడుకు బానిసై భార్యాబిడ్డలను పట్టించుకునేవాడు కాదు. దీంతో సుజాత బీడీలు చుడుతూ కొడుకు, బిడ్డలను పెంచి పెద్ద చేసింది. అప్పోసప్పోజేసి 2015లో పెద్దబిడ్డ పెండ్లి చేసింది. ఆ తర్వాత రెండు నెలలకే అనారోగ్యంతో మరణించింది. కొన్ని రోజుల తర్వాత గంగారాం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
కుటుంబసభ్యులు ఎంత వెదికినా అతడి జాడ దొరక లేదు. ఇద్దరు పిల్లలను అమ్మమ్మ కల్వకోటలోని తన ఇంటికి తీసుకెళ్లింది. ఇన్నాళ్లూ కూలినాలి జేసి వారిని సాకింది. ఇప్పుడు వయోభారంతో సతమతమవుతున్న ఆమెపై ఇద్దరు పిల్లల పోషణ భారం సైతం పడడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నది. పిల్లలకు బుక్కెడు తిండిపెట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. ఇక తనకు మనమడు, మనుమరాలును సాదే పరిస్థితి లేదని దీనంగా చెబుతున్నది. దయార్ద్రహృదయులు చేయూతనందించాలని అర్థిస్తున్నది. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు వజ్రమ్మ యూబీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 033010100133891 ఐఎఫ్ఎస్సీ కోడ్ నెంబర్ యూబీఐఎన్0803308, బ్రాంచ్ కోరుట్ల ఖాతాలో జమ చేయాలని కోరింది. లేదా ఫోన్ పే నంబర్ 9391527410 (కుంట శ్రీనివాస్, చిన్నారుల మేనమామ)కు తమకు తోచినంత ట్రాన్స్ఫర్ చేసి పిల్లలకు అండగా నిలువాలని వేడుకున్నది.