కొత్తపల్లి, మే 21: అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని, కలలను సాకారం చేసుకోవాలని యువతకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా చదువుకున్న వారందరికీ సర్కారు కొలువులు ఇవ్వలేదని, అమెరికాలో సైతం 90 శాతానికి పైగా ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగాలు ఉన్నాయనే విషయాన్ని ఉదహరించారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో యువజన సర్వీసుల శాఖ, టీఎస్స్టెప్, డీసీఎస్ స్టాఫింగ్ ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్మేళాను శనివారం ప్రారంభించారు. అనంతరం పలువురికి నియామకపత్రాలు అందించి మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా ఒకే ఏడాది 80 వేలకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా చేపట్టామని, యువత ప్రతిభను నమ్ముకొని కొలువులు కొట్టాలని సూచించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్మేళాను నిర్వహించడం అభినందనీయమన్నారు. సమైక్య పాలనలో జరిగిన నష్టాన్ని సవరించేందుకే సీఎం కేసీఆర్ కొత్తజోన్లకు రూపకల్పన చేసి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు చేపట్టారన్నారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూడవద్దన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తాను మొదట హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో 630 వేతనంతో సైట్ ఇంజినీర్గా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఇక్కడి జాబ్ మేళాలో పాల్గొన్న 26 కంపెనీల్లో చాలా వరకు ప్రఖ్యాతిగాంచినవేనని చెప్పారు. జిల్లా యువతకు 2200 నుంచి 2500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశమున్నదన్నారు. కంపెనీల ప్రతినిధులు సైతం అనుభవం లేదని నిరాకరించవద్దని, వారికి ఒక అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ వై సునీల్రావు, నగరపాలక సంస్థ కమిషనర్ సేవ ఇస్లావత్, డీవైఎస్వో కీర్తి రాజవీరు, బేస్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
ట్రాన్స్జెండర్లకు కొలువులు
ఈ జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. ఇందులో పాల్గొన్న 26 కంపెనీలు ఏడో తరగతి నుంచి బీటెక్, ఎంటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చదివిన వారికి ఉద్యోగాలు ఇచ్చాయి. ట్రాన్స్జెండర్లు, చెవిటి, మూగ, శారీరక దివ్యాంగులకు సైతం అవకాశాలు కల్పించారు. ఇందులో పలువురు మంత్రి చేతులమీదుగా ఆఫర్లెటర్లు అందుకొని మురిసిపోయారు.
ఇదే నా మొదటి ఉద్యోగం
కరీంనగర్ అల్ఫోర్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ బయోటెక్నాలజీ పూర్తిచేసిన. ఈ జాబ్మేళాలో ప్రీమియర్ హెల్త్కేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఇంటర్వ్యూ పూర్తయిన వెంటనే కంపెనీ ప్రతినిధులు నియామక పత్రం అందించారు. నెలకు రూ. 15వేల వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇదే నా మొదటి ఉద్యోగం, ఎంతో సంతోషంగా ఉన్నది. మాటలు రావడం లేదు. తల్లిదండ్రులు, స్నేహితులతో ఈ ఆనందాన్ని పంచుకున్న.
– పత్తిపాక నాగలక్ష్మి, బీఎస్సీ బయో టెక్నాలజీ
అపోలో ఫార్మసీలో జాబ్..
ఈ జాబ్మేళాలో నాకు ఫార్మాసిస్ట్గా ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్ అపోలో ఫార్మసీలో ఉద్యోగానికి ఎంపికైన. కంపెనీ వారు మొదటినెల వేతనంగా రూ 14వేలు ఇస్తామన్నారు. ఇలాంటి జాబ్ మేళాలతో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.
– పీ స్పందన, ఎం ఫార్మసీ
జాబ్మేళాకు మంచి స్పందన
కరీంనగర్లో నిర్వహించిన జాబ్ మేళాకు యువతీ యువకుల నుంచి విశేష స్పందన లభించింది. 26 ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొనగా సుమారు 2500 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు చూపే ప్రతిభ అధారంగా ఉద్యోగాలు అందుతాయి. ప్రైవేట్ రంగంలో సైతం మంచి వేతనాలు దక్కుతాయి.
– సత్యవాణి నారాయణమం, డైరెక్టర్,డీసీఎస్ అండ్ స్టాఫింగ్ ప్రైవేట్ లిమిటెడ్
ట్రాన్స్జెండర్లకు అవకాశమివ్వడం సంతోషం
ఈ జాబ్ మేళాలో యువతీ యువకులతో పాటు ట్రాన్స్జెండర్లు, చెవిటి, మూగ, శారీరక దివ్యాంగులకు అవకాశం కల్పించడం అభినందనీయం. ఇలాంటి వారికి జాబ్ మేళా ద్వారా అవకాశాలు కల్పించడం రాష్ట్రంలోనే ఇది మొదటిసారి అనుకుంటున్నాం. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన మాకు కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తప్పకుండా ఇద్దరికి జాబ్ ఇస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది.
– తనుశ్రీ, గోల్డ్, ట్రాన్స్జెండర్లు