పెగడపల్లి, మే 21 : చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరందించి రైతుల ఇబ్బందులు తొలగించేందుకే జలహితం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో జలహితం-జనహితం-2 కార్యక్రమాన్ని ఈశ్వర్ ప్రారంభించారు. ఎస్సారెస్పీ కాలువలో జలహితంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో కలిసి మంత్రి కాలువ పూడిక తీత పనులను ప్రారంభించారు. అనంతరం నందగిరి గ్రామ కాళేశ్వరం లింక్-2 ప్రాజెక్టు ద్వారా నందగిరి గ్రామ చెరువులోకి సాగు నీరందించే తూము నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలోనే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, రెండేళ్ల క్రితం మొదటి విడుత జలహితం చేపట్టి దాదాపుగా ఎస్సారెస్పీ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టామని, దీంతో నీటి వృథాను అరికట్టడంతోపాటు, చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరందించామని పేర్కొన్నారు.
రెండో విడుతలో మిగిలిన కాలువలతో పాటు, గతంలో చేపట్టిన కాలువల్లో పేరుకపోయిన పూడికమట్టి, చెట్లు, బండరాళ్లను తొలగిస్తామని, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పనుల్లో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఆయకట్టేతర ప్రాంతాలు సస్యశ్యామలమయ్యాయన్నారు. నందగిరి, ఐతుపల్లి గ్రామానికి సాగు నీరిచ్చే వరకు ఓట్లడుగనని ఇచ్చిన మాట ప్రకారం ఐతుపల్లికి ఇది వరకే నీళ్లిచ్చామని, నందగిరికి వచ్చే యాసంగి పంటకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని, పనులు వేగవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
అనంతరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులకు భూమిపూజ చేయడంతో పాటు, తెనుగువాడలో రూ.10 లక్షలతో మురుగు కాలువ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. బతికపల్లి గ్రామంలో రూ.6.65 కోట్లతో రెండు వంతెనల నిర్మాణ పనులు, దోమలకుంటలో రూ.కోటితో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 18 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాజేందర్రావు, విండో చైర్మన్ కర్ర భాస్కర్రెడ్డి, వైస్ ఎంపీపీ గంగాధర్, ఏఎంసీ చైర్మన్ తిరుపతినాయక్, పార్టీ మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకన్న, సర్పంచులు గాజుల రాకేశ్, బాల్సాని నిహారిక-శ్రీనివాస్, టీ శోభారాణి, రాజేశ్వర్ రావు, కరుణాకర్ రెడ్డి, లక్ష్మణ్, కొండయ్య, ఎంపీటీసీ గంగరెడ్డి, తహసీల్దార్ కృష్ణచైతన్య, ఎంపీడీవో పుల్లయ్య, ఎంపీవో మహేందర్, ఏపీవో వేణు, మండల యూత్ అధ్యక్షుడు సొల్లేటి సంతోష్, పార్టీ నాయకులు గోలి సురేందర్రెడ్డి, ఇరుగురాల ఆనందం, గాజుల గంగ మల్లేశం, ఆరెల్లి లక్ష్మీరాజం, ఎం.కరుణాకర్రావు, మడిగెల తిరుపతి, అందె వెంకన్న, షేక్ షకీల్, క్యాస గంగాధర్, మడిగెల మనోహర్, రాజు ఆంజనేయులు, కాశెట్టి వీరేశం, వెల్మ సత్యనారాయణ రెడ్డి, గోలి సంజీవరెడ్డి, అజయ్, పీ విజయ్యాదవ్, మల్లేశ్ యాదవ్, తోట మహేందర్, తదితరులున్నారు.