తిమ్మాపూర్ రూరల్, మే 21:ప్రస్తుతం సామాన్యుడు కష్టపడి ఒక్క ప్లాటు కొనుక్కోవాలంటే బహిరంగ మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. ఏ మూలకు పోయినా తిమ్మాపూర్ మండలంలో గుంట జాగా రూ.లక్షల్లో ఉన్నది. స్థిరాస్తి వ్యాపారంలో ఉమ్మడి జిల్లాలోనే డిమాండ్ ఎక్కువగా ఉన్న నుస్తులాపూర్ రెవెన్యూ పరిధిలో ‘రాజీవ్ స్వగృహ అంగారిక టౌన్ షిప్’ పేరుతో ప్లాట్లను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. డీటీసీపీ, సుడా అప్రూవ్డ్ లేఅవుట్ పర్మిషన్లతో అందుబాటు ధరలకు వీటిని వేలం ద్వారా విక్రయించనుండగా, కొనుగోలుకు ప్రజానీకం ఆసక్తి చూపుతున్నది.
సామాన్యుడికి సరమైన ధరల్లో ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం రామకృష్ణకాలనీ గ్రామంలో సుభాష్నగర్ వద్ద సుమారు వంద ఎకరాల స్థలాన్ని సేకరించింది. తదనంతరం వివిధ పరిణామాలతో నిర్మాణాలు నిలిచిపోగా ఆ స్థలం ఖాళీగా ఉండి పోయింది. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టుల పేర్లు వినిపించినప్పటికీ.. ప్రస్తుతం ప్రభుత్వం ప్లాట్లుగా ఏర్పాటు చేసి విక్రయానికి సిద్ధపడింది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారికి పక్కనే ఉన్న వీటిని దక్కించుకోవడానికి పలువురు ఇప్పటికే వివరాలు తెలుసుకుంటున్నారు. స్థానిక అధికారులు, తెలిసిన వారిని సంప్రదిస్తున్నారు.
మొదటి విడుతగా 237 ప్లాట్ల విక్రయం
నుస్తులాపూర్ రెవెన్యూ పరిధిలోని ‘రాజీవ్ స్వగృహ అంగారిక టౌన్ షిప్’లో మొత్తం ప్లాట్లు 819 కాగా, ప్రస్తుతం మొదటి విడుతగా 237 ప్లాట్లను మాత్రమే ప్రభుత్వం బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నది. 200గజాలకు ఒక ప్లాటుగా ఏర్పాటు చేయనున్నది. నివాస స్థలానికి గజానికి రూ.6వేలు, వాణిజ్య స్థలానికి 8వేలుగా నిర్ణయించారు. అంగారిక టౌన్ షిప్ కింద 86.95ఎకరాల లే అవుట్కు ప్రభుత్వం ఆమోదించగా, భవిష్యత్తు అభివృద్ధి పనుల కోసం ఐదు ఎకరాలను వేలం వేయడం లేదు. ప్రస్తుతం 81.95ఎకరాల జాగాను ప్లాట్లుగా మార్చనున్నారు.
ఇదీ వేలం విధానం
ఈ వేలం పాటలో పాల్గొనాలంటే రూ.10వేలను ‘జిల్లా కలెక్టర్, రాజీవ్ స్వగృహ’ పేరిట ఖాతా నంబర్ 130701001392, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఐసీఐసీ 0001307లో డీడీ రూపంలో ధరావత్తు రుసుం చెల్లించి, ఆ డీడీని కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న సుడా కార్యాలయంలో అందజేయాలి. తాము ఏ ప్లాటుపై డీడీ తీసింది తెలియజేస్తూ ఒక ఫారం అందజేసి రిసిప్ట్ తీసుకోవాలి. అనంతరం ఎంచుకున్న ప్లాటు ఏ రోజు వేలంలో ఉందో సమాచారం తెలుసుకొని పాల్గొనాలి. డీడీ తీయడానికి జూన్ 19 చివరి తేదీ. ఒక వ్యక్తి ఎన్ని ప్లాట్లపై అయినా వేలంలో పాల్గొనవచ్చు. కానీ ఒక్క డీడీని ఎంపిక చేసుకున్న సదరు ప్లాటుకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఒక ప్లాటుపై వేలం పాటలో రాకపోతే ఆ డీడీ మరో ప్లాటు వేలంలో పాల్గొనడానికి వీలు లేదు. అలాగే వేలం పాటలో ప్లాటు దక్కించుకోకపోతే ధరావత్తు రుసుంగా కట్టిన రూ.పది వేలు తిరిగి చెల్లిస్తారు. మొదటి విడుతలో విక్రయించనున్న 237ప్లాట్లకు నుస్తులాపూర్లోని రైతువేదికలో జూన్ 20 నుంచి 26 తేదీల్లో బహిరంగ వేలం వేయనున్నారు. జూన్ 20న 25కమర్షియల్, 25గృహావసరాల ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు. అలాగే 21 నుంచి 24 తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో రోజుకు 50 చొప్పున ప్లాట్లకు అధికారులు వేలం పాట నిర్వహించనున్నారు. అలాగే బహిరంగ వేలం నిర్వహణ, అవగాహన కోసం ఈ నెల 30న అధికారులు నుస్తులాపూర్ రైతువేదికలో అవగాహన కల్పించనున్నారు.
గతంలో ధరవత్తు రుసుం చెల్లించిన వారికీ అవకాశం
అలాగే రాజీవ్ స్వగృహలో ప్లాట్లకోసం గతంలో రూ.3 వేలు, 5 వేలు, 10 వేలు ధరవత్తు రుసుం చెల్లించిన వారు సుడా కార్యాలయంలో సమాచారం అందించి వేలంలో పాల్గొనవచ్చు. ఒకవేళ గతంలోనే ధరవత్తు రుసుం తిరిగి తీసుకున్నా కూడా అదే రుసుం మళ్లీ డీడీ తీసి ఆధారాలతో సంప్రదించాలి. వారికి ఈ యాక్షన్ ప్లాన్లో అవకాశం ఇవ్వనున్నారు. బహిరంగ వేలంలో పాల్గొనడానికి సమగ్ర సమాచారం కోసం https://karimnagar.telangana.gov.in వెబ్సైట్లో గాని, 7093750333, 8801821478 ,9885210201,7993455784 లేదా, సైట్ కార్యాలయం నంబర్ 9381635708, కలెక్టర్ కార్యాలయం 8801821478, రాజీవ్ స్వగృహ కార్యాలయం 7993455784 సెల్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
సువర్ణావకాశం.. వినియోగించుకోవాలి
ప్రభుత్వం ఇంత విలువైన భూములను అందుబాటు ధరలకు వేలం ద్వారా విక్రయిస్తుండడంతో చాలా మంది సంప్రదిస్తున్నారు. స్థానికంగా హెల్ప్డెస్క్ను సైతం ఏర్పాటు చేశాం. అన్ని అనుమతులతో ప్రభుత్వం విక్రయిస్తుండడంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రజలు డీడీలు తీసి వేలంలో పాల్గొనాలి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సువర్ణావకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలి. ప్లాట్లుగా మార్చడానికి పనులు త్వరితగతిన సాగుతున్నాయి. నిత్యం ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశనం చేస్తున్నారు.
-పడిగెల రాజ్కుమార్, తహసీల్దార్, తిమ్మాపూర్