మానకొండూర్, మే 21: ఈనెల 23 నుంచి జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాకాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మండలంలోని 15 ప్రభుత్వ, 4 ప్రయివేట్ పాఠశాలల నుంచి మొత్తం 539 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మండల వ్యాప్తంగా నాలుగు పరీక్షా కేంద్రాలు (మానకొండూర్ బాలుర ఉన్నత పాఠశాల, కొండపల్కల జడ్పీహెచ్ఎస్, పోచంపల్లి మోడల్ స్కూల్, దేవంపల్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్) ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బందిని నియమించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి రావడానికి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.
హాల్టికెట్ల పంపిణీ పూర్తి
పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే హాల్టికెట్లను అందజేశారు. హాల్టిక్కెట్లు అందని విద్యార్థులు సంబందిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి పొందవచ్చు. ఫీజులు చెల్లించలేదనే కారణంగా విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలల యాజమన్యాలు హాల్టికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈవో హెచ్చరించారు.
టైం టేబుల్
ఈ నెల 23 నుంచి జూన్ 1వరకు ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగనున్నాయి. 23న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, 24న సెకండ్ లాంగ్వేజ్, 25న ఇంగ్లిష్, 26న గణితం, 27న జనరల్ సైన్స్, 28న సాంఘిక శాస్త్రం, జూన్ 1న వొకేషనల్ కోర్స్ పరీక్షలు.
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
తిమ్మాపూర్ రూరల్, మే 21: ఈ నెల 23 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని పలు పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలు, గదులను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు, ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇక్కడ ఆయా పాఠశాలల హెచ్ఎంలు తదితరులు ఉన్నారు.
గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నాం. గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిర్దేశించిన సమయం దాటిన తరువాత వచ్చే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
-మధుసూదనాచారి, మానకొండూర్ ఎంఈవో