కొత్తపల్లి, మే 21: బీసీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో శనివారం బీసీ వసతి గృహాల విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి వేసవి సాంస్కృతిక సంబురాలను ఆయన కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చదువు, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రాధాన్యమివ్వలేదన్నారు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రూ. కోట్లు వెచ్చించి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 280 బీసీ గురుకులాలను ఏర్పాటు చేసి 1.52 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు తెలిపారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ. లక్షా 25 వేలను ఖర్చు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 83 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. ప్రతిభను నమ్ముకొని ఉన్నత వర్గాలకు ధీటుగా బీసీలు ఉద్యోగాలు సాధించాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి.
అద్భుత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
కరీంనగర్ను రాష్ట్రంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నగరంలోని 40, 21వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులను ఆయన మేయర్ వై సునీల్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే రాజధాని తర్వాత కరీంనగర్ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో రూ. 134 కోట్లతో వరద కాలువల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం అస్యూరెన్స్, పట్టణ ప్రగతి నిధులతో అన్ని డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.
అతి త్వరలోనే నగరంలోని మూడు రిజర్వాయర్ల పరిధిలో 24 గంటల మంచినీటి సరఫరా అందించేందుకు పనులు చేపడుతున్నామన్నారు. కేబుల్ బ్రిడ్జిని కూడా అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కరీంనగర్ పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. కార్పొరేటర్లు భూమాగౌడ్, జంగిలి సాగర్, వాల రమణారావు, గంట కళ్యాణి-శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహర్, నాయకులు చల్ల హరిశంకర్, దేవేందర్, బాలయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.