ముకరంపుర, మే 19: కరీంనగర్ పట్టణంలో విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతున్నది. ఇందుకు తగ్గట్లుగా విద్యుత్ అధికారులు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంతో పాటు మాల్స్, పలు వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలకు బ్యాంక్ కాలనీ, సమీప ప్రాంతాలు కేంద్రాలుగా ఉన్నాయి. గృహ, వాణిజ్య పరంగా నాణ్యమైన విద్యుత్ను అందించేలా అధికారులు ఆర్అండ్బీ క్వార్టర్స్ ప్రాంతంలో రూ.2 కోట్లతో 33/11కేవీ సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు. పనులు పూర్తవడంతో ఈనెల 8న ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సబ్స్టేషన్ను టెక్నికల్గా ప్రారంభించారు.
పదికి చేరిన 33/11కేవీ సబ్స్టేషన్లు
బ్యాంక్ కాలనీ ప్రాంతంలోని ఆర్అండ్బీ సబ్స్టేషన్తో నగరంలో 33/11కేవీ సబ్స్టేషన్ల సంఖ్య పది చేరింది. ఇందులో ఆరు 11కేవీ ఫీడర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కోర్టు రోడ్డు, బ్యాంక్ కాలనీ, వరలక్ష్మినగర్, మెహర్నగర్ ఫీడర్లు ఏర్పాటు చేసి సరఫరా అందిస్తున్నారు. దీంతో బ్యాంక్ కాలనీ, మెహర్నగర్, రెడ్డి హాస్టల్ ఏరియా వెనుక ప్రాంతం, సీతారాంపూర్లోని కొంత ప్రాంతం, చైతన్యపురి, కెమిస్ట్ భవన్ ఏరియాలో 8వేలకు పైగా సర్వీసులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతాలకు వావిలాలపల్లె, ఎస్సారార్ కాలేజీ, రేకుర్తి సబ్స్టేషన్ల నుంచి సరఫరా జరుగుతుంది. ఇకపై ఈ సబ్స్టేషన్లకు సైతం రిలీఫ్ లభించనుంది. సుమారు నాలుగు ఫీడర్లపై ఓవర్లోడ్ భారం తప్పనుంది. అలాగే, రేకుర్తి సబ్స్టేషన్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా ఆర్అండ్బీ సబ్స్టేషన్ నుంచి సరఫరా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.