వీణవంక, మే 19: సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ ఏర్పడిందని ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని కొండపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో స్థానిక నాయకులతో కలిసి మన ఊరు-మన బడి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పేద విద్యార్థులకు మంచి చదువును అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సకల సదుపాయాలతో నాణ్యమైన విద్యను అంధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిధులు మంజూరు చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, వైద్యానికి ఎలాంటి ఆదరణ లేక పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి కార్పొరేట్ స్థాయి విద్యను పొందాలనే సంకల్పంతో సకల హంగులతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. తల్లిదండ్రులకు ఎలాంటి ఖర్చు లేకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించకుండా సకల సౌకర్యాలతో నిర్మితమవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ మావురపు విజయభాస్కర్రెడ్డి, మాజీ చైర్మన్ మాడ సాదవరెడ్డి, ఉప సర్పంచ్ రామగుండం రాజ్కుమార్, ఎంపీటీసీ నల్ల మమత-తిరుపతిరెడ్డి, ఎలుబాక సర్పంచ్ కొత్తిరెడ్డి కాంతారెడ్డి, జమ్మికుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేశ్, హెచ్ఎం అన్వర్, నాయకులు పైడి కుమార్, భాస్కర్, కొమురయ్య, సంపత్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం రాజేశ్వరి పాల్గొన్నారు.