యాసంగి ధాన్యం సేకరణ ఊపందుకున్నది. సర్కారు అంతేవేగంగా రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నది. సిరిసిల్ల జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభమైన వారంలోనే అంటే.. ఈ నెల 15 వరకు 7,645 మంది రైతుల వద్ద 21వేల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించింది. 3,886 రైతులకు సంబంధించి రూ. 52.03 కోట్ల విలువైన ధాన్యం వివరాలను ఆన్లైన్లో నమోదు చేసింది. అందులో 1460 మందికి రూ. 19.78 కోట్లను చెల్లించింది. ధాన్యం అమ్మిన మూడురోజుల్లోనే నగదు అందుతుండడంపై రైతాంగం ఆనందంలో మునిగితేలుతున్నది.
– రాజన్న సిరిసిల్ల, మే 18 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, మే 18 (నమస్తే తెలంగాణ): జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, 16 హామ్లెట్ గ్రామాలున్నాయి. రైతాంగంపై రవాణా భారం పడవద్దనే ఉద్దేశంతో జిల్లాలో 265 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు 107.28 కోట్ల విలువ గల 20,837.520 మెట్రిక్ టన్నులు 7645 మంది రైతుల నుంచి కొన్నది. 3,886 మంది రైతులకు సంబంధించి రూ. 52.03 కోట్ల వివరాలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. మూడు రోజుల్లోనే 1460 మంది ఖాతాల్లో రూ. 19.78 కోట్లు జమచేశారు. కొనుగోళ్ల వివరాలను ఆన్లైన్ చేసేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
అధికారుల పర్యవేక్షణ..
జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, మార్కెటింగ్ మేనేజర్ హరికృష్ణ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అవసరం మేరకు గన్నీ సంచులను అందుబాటులో ఉం చారు. కొన్న ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలింపజేస్తున్నారు. అలాగే సర్ధాపూర్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్న గోదాములకు తరలించి భద్రపరుస్తున్నారు.
కేసీఆర్ సార్తోనే సేన్లకు సిరచ్చింది..
నాపేరు మెడెదుల బాలవ్వ, నా భర్త పేరు ఎల్లయ్య. మాది సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరు. మాకు అయిదెకరాలు భూమిన్నది. రెండెకరాల్లో వరేసినం. యాసంగి వడ్లను కేంద్రం కొంటలేదని తెలిసి ఆగమైనం. వడ్లు కొనకుంటే తెచ్చిన బాకీ తీర్చుడెట్ల అని రందిపడ్డం. కానీ కేసీఆర్ సార్ ధాన్యం కొంటామని చెప్పంగనే ప్రాణం లేసొచ్చింది. ఆంధ్రోళ్లున్నప్పుడు ఇత్తునాలు, ఎరువులు దొరక్క, టైంకు కరెంట్ రాక మస్తు గోసెళ్లదీసినం. కానీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక సేన్లకు ‘సిరి’ వచ్చింది. రెండెకరాల్లో పండించిన వడ్లలో 32 క్వింటాళ్లను మా పెద్దూరులోని కేంద్రంలో అమ్మిన. మూడు రోజులకే రూ.62,720 బ్యాంకులో జమైనయ్. ఎప్పుడు గింత జెల్ది పైసలు రాలే. పెద్ద సార్ ఉన్నన్ని రోజులు ఎవుసానికి బాధలేదు. రైతుల బతుకులకు ఢోకాలేదంటూ సంబురంగా చెబుతున్నది. ఇలా బాలవ్వ ఒక్కరే కాదు స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు పాలనలో ప్రతి ఒక్కరూ రంది లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు. 24 గంటల ఉచిత కరెంట్, పంటపెట్టుబడి సాయం, రైతుబంధు, రైతు బీమాలాంటి పథకాలతో పండుగలా సేద్యం చేసుకుంటున్నారు.
మూడురోజులకే పైసలు పడ్డయ్..
నాకు ఐదెకరాల పొలం ఉన్నది. ఇందులో వరి వేసిన. 130 క్వింటాళ్ల వడ్లు అచ్చినయ్.. పెద్దూరు కొనుగోలు కేంద్రంలో అమ్మితే రూ. 2. 57 లచ్చలు వచ్చినయ్. మూడు రోజుల్లోనే నాఖాతాలో జమైనయ్. గతేడు వానకాలంలో అమ్మిన వడ్ల పైసలు రావడానికి వారం రోజులు పట్టింది. ఇపుడు వెంటనే పడ్డయ్. కేసీఆర్ సార్, మంత్రి కేటీఆర్ సార్లు ఉన్నంత కాలం మాకు ఇబ్బందిలేదు.
– సలేంద్రీ వెంకటేశం, రైతు పెద్దూరు