మంథని టౌన్, మే 18: మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు మూడేళ్లలో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో శ్వేతపత్రం విడుదల చేయాలని టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు తగరం శంకర్లాల్, యూత్ మండలాధ్యక్షుడు కొండ రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్పర్సన్ శ్రీరాంభట్ల సంతోషిణి డిమాండ్ చేశా రు. మంథని ప్రెస్క్లబ్లో బుధవారం వారు మాట్లాడారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగడంతోనే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఉనికి కోల్పోతామనే భయంతోనే స్థాయిని మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మధూకర్ ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో అనేక సేవలు చేశారని, ఈనాడు అలాంటి సేవలను శ్రీధర్బాబు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించడం తప్పా అని పేర్కొన్నారు.
‘మధూకర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆడ బిడ్డలకు పెండ్లిళ్లు చేసిండు.. ఆకలి అన్న వారికి అన్నం పెట్టి ఆదుకున్నాడు.. నేనున్నానంటూ ప్రతి పేద కుటుంబానికి భరోసా ఇచ్చారని’ గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరికి ఏం చేసిండో చెప్పాలని ప్రశ్నించారు. 30 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేయని అభివృద్ధిని నాలుగేళ్లలోనే మధూకర్ చేసి చూపించారన్నారు. ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ స్థాయిలో విమర్శలు చేశారని.. దమ్ముంటే ఎమ్మెల్యే శ్రీధర్బాబు విమర్శలు చేయాలని, స్థాయి మరిచి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సెగ్గెం రాజేశ్ వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలి వేస్తున్నామని, ఆయన మాట్లాడిన తీరును ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
నేతకాని సంఘం అనే ట్యాగ్లో తుపాకీ పట్టుకుని ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే సెగ్గెం రాజేశ్ … మధూకర్పై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. గౌరవ హోదాలో ఉన్న తమ నాయకుడిపై మరోసారి విమర్శలు చేస్తే అంబేద్కర్ సాక్షిగా గుణ పాఠం చెప్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏగోలపు శంకర్గౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కనవేన శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ నాయకులు వేల్పుల గట్టయ్య, అక్కపాక సంపత్ తదితరులు పాల్గొన్నారు.