కరీంనగర్, మే18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఉమ్మడి జిల్లాపై ప్రేమను చాటుకున్నారు. త్వరలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్రావును అభ్యర్థిగా ప్రకటించారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో దామోదర్రావు పేరును ఖరారు చేసి, ఉమ్మడి జిల్లా నుంచి మళ్లీ ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠకు తెరదించారు. టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ సంఖ్యా బలం ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నిక లాంఛనప్రాయం కానున్నది.
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామానికి చెందిన దీవకొండ దామోదర్రావు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆనాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడిచారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేయడమే కాకుండా.. ‘టీ న్యూస్’, ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికల మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ.. ఉద్యమానికి వెన్నుదన్నులా నిలిచారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ.. స్వరాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. ఇటీవల కరీంనగర్లో టీటీడీ పుణ్యక్షేత్రం నిర్మాణానికి కీలకంగా కృషి చేశారు. తాజాగా రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది.