జమ్మికుంట రూరల్, మే 14: దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. అణగారిన వర్గాలు ఆర్థికాభివృద్ధి చెందాలనే అంబేద్కర్ కలలను సాకారం చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని వినయ్భాస్కర్ కొనియాడారు. జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన దళితబంధు లబ్ధిదారులు గంగారపు సారయ్య-సుశీల, గంగారపు యశ్వంత్-సుధ హన్మకొండ పట్టణంలోని ఫాతిమానగర్లో సెంట్రింగ్ షాపును ఏర్పాటు చేసుకున్నారు. హుజురాబాద్ టీఆర్ఎస్పార్టీ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి ఎమ్మెల్యే శనివారం సెంట్రింగ్ షాపును ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బంధు దేశం గర్వించ దగ్గ గొప్ప పథకమని అభివర్ణించారు. ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ ఏలకంటి రాములు, కాలనీ అధ్యక్షుడు సోమయ్య, కార్యదర్శి నరేందర్, ఆర్యవైశ్య సంఘం యువజన నాయకుడు శరత్కుమార్ తదితరులు ఉన్నారు.