కార్పొరేషన్, మే 14: అందరి సహకారంతో నగరానికి అవార్డులు వస్తున్నాయని, రానున్న రోజుల్లో కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని, రాష్ట్ర సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు సౌకర్యాలు కల్పిస్తామని నగర మేయర్ వై.సునీల్రావు స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పట్టణ ప్రగతి కార్యక్రమంలో నగరంలో నూతన విధానాలను అవలంబించి ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు కృషి చేశామన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా లక్షకు పైగా జనాభా ఉన్న నగరాల్లో ఉత్తమ ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్టర్స్ విభాగంలో అధికారులు, పాలకవర్గ సభ్యులు, ప్రజల సహకారంతోనే అవార్డు సాధ్యమైందని తెలిపారు. నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, మంత్రి గంగుల కమలాకర్ ఎంతో సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. గత పట్టణ ప్రగతి ద్వారా రూ. 57 కోట్లు రాగా ఇప్పటి వరకు రూ. 41.54 కోట్లు వ్యయం చేశామన్నారు.
73 శాతం నిధులను పూర్తిగా మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేశామని తెలిపారు. వీటిల్లో పార్కులు, నర్సరీలు, స్మశాన వాటికలు, హరితహరం, సానిటేషన్ పనులు, పబ్లిక్ టాయిలెట్స్, పుట్పాత్లు, ఓపెన్ జిమ్స్, వాకింగ్ ట్రాక్స్ వంటి ఎన్నో అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిధులు పూర్తిస్థాయిలో సక్రమంగా వినియోగించటం ద్వారా తమకు ఈ అవార్డు వచ్చిందన్నారు. పట్టణ ప్రగతి నిధుల్లో రూ. 5.95 కోట్లు శానిటేషన్ పనులను మరింతగా మెరుగుపర్చేందుకు, రూ. 4.47 కోట్లను నర్సరీల ఏర్పాటుకు, రూ.1.80 కోట్లు వైకుంఠధామాల నిర్మాణాలు, రూ. 1.31 కోట్లు పార్కులు, ఇతర అభివృద్ధి పనులు, రూ. 1.36 కోట్లు పబ్లిక్ టాయిలెట్స్ అభివృద్ధికి, రూ. 1.26 కోట్లు పుట్పాత్ నిర్మాణాలకు, రూ. 25 కోట్లు ఇతర అభివృద్ధి పనులకు వినియోగించామన్నారు. మార్చి 2023 నాటికి మున్సిపాలిటీల్లో పలు కార్యక్రమాలను పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ లక్ష్యంగా పెట్టారని తెలిపారు.
వాటిల్లో ముఖ్యంగా నగరాల అవసరాల దృష్టిలో పెట్టుకొని వచ్చే 25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారని, ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సులువుగా నిర్మాణ అనుమతులు వచ్చేలా ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడా వ్యవసాయ జోన్ లేకుండా చేస్తామన్నారు. అలాగే డిజిటల్ డోర్ నంబర్స్, మెకానైజ్డ్ ధోబీఘాట్స్, బయోమైనింగ్, అర్బన్ లంగ్ బేస్లను కూడా లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు తోట రాములు, కంసాల శ్రీనివాస్, నేతికుంట యాదయ్య, ఐలేందర్యాదవ్, గందె మాధవి, సరిళ్ల ప్రసాద్, బోనాల శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.