తిమ్మాపూర్ రూరల్, మే14: అర్ధాంతరంగా తనువు చాలించిన మెడికల్ పీజీ విద్యార్థి డాక్టర్ శ్వేత.. ‘అమ్మానాన్న ఇక సెలవు’ అంటూ భౌతికంగా ఈ లోకం నుంచి నిష్క్రమించింది. శనివారం ఆమె అంత్యక్రియలను తిమ్మాపూర్లో బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య నిర్వహించారు. కడసారి చూపుకోసం పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. శంకరపట్నం మండలం మెట్పల్లికి చెందిన శ్రీనివాస్ తిమ్మాపూర్లోని హౌసింగ్ సొసైటీలో వాచ్మెన్గా పని చేస్తూ.. కుటుంబంతో కలిసి గత 20 ఏండ్లుగా తిమ్మాపూర్, రామకృష్ణకాలనీ గ్రామాల్లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు కాగా కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. బిడ్డ శ్వేత ఎంబీబీఎస్ చల్మెడ ఆనందరావు వైద్యకళాశాలలో పూర్తి చేసి ప్రస్తుతం నిజామాబాద్లో గైనకాలజీలో పీజీ రెండో సంవత్సరం చదువుతుంది. అప్రెంటిషిప్లో భా గంగా నిజామాబాద్ సర్కారు దవాఖానలో గైనిజ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆమె శుక్రవారం అర్థరాత్రి హఠాన్మరణం చెందింది. స్నేహితులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి కుటుంబసభ్యులు శ్వేత మృతదేహాన్ని తిమ్మాపూర్ నిర్మితి కేంద్రం వద్దకు తీసుకువచ్చారు. శనివారం మధ్యాహ్నం ఎల్ఎండీ రిజర్వాయర్ సమీపంలో అంత్యక్రియలు చేశారు.