జమ్మికుంట రూరల్, మే 12: ఇల్లందకుంట మండలంలో దళిత బంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్ను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం దళిత బంధు, ఉపాధి హామీ పనులు, నర్సరీల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకాల అమలుపై ఎంపీడీవో విజయలక్ష్మికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దళిత బంధులో భాగంగా లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను పరిశీలించాలన్నారు. అలాగే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయినప్పటికీ గ్రౌండింగ్ ఆలస్యంగా జరుగుతున్నదని, లబ్ధిదారులను పిలిపించి యూనిట్లను గ్రౌండింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో 200 మంది కూలీలకు తగ్గకుండా చూడాలని ఆదేశించారు.
నర్సరీల్లో హరితహారం మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అంతకుముందు మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంటతో పాటు మండలంలోని సిరిసేడు ప్రభుత్వ పాఠశాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. మౌలిక వసతుల కల్పనపై ఎంఈవో సుధాకర్, డీఈని అడిగి తెలుసుకున్నారు. మన ఊరు -మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, ప్రజలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. పాఠశాలల మరమ్మతులు త్వరగా పూర్తి చేయించాలని చెప్పారు. ఇక్కడ మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, ఏఈ శ్రీకాంత్, ఏపీఎం రమాదేవితో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.