గోదావరిఖని, మే 12: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, రిటైర్డు కార్మికులకు తగిన వైద్య సేవలు అందించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాం సూచించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థతో ఒప్పందం గల పలు కార్పొరేట్ దవాఖానల ప్రతినిధులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయన ఇప్పటివరకు కార్పొరేట్ దవాఖానల్లో సింగరేణీయులకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు. సాంకేతిక కారణాలతో వైద్య సేవల్లో లోటు రానీయవద్దని, అత్యవసర సేవలను సమర్థంగా అందించాలన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యంపై కొన్ని దవాఖానల వారు చేసిన అభ్యర్థనలపై ఆయన మాట్లాడుతూ దీనిపై తాము ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, పెండింగ్ బిల్లుల చెల్లింపును ఇటీవల కాలం వరకు పూర్తి చేశామని వివరించారు. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేసి బిల్లుల చెల్లింపులు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఎం కో-ఆర్డినేషన్ సూర్యనారాయణ మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు కంపెనీ నుంచి దవాఖానలకు అనుమతులు శీఘ్రగతిన ఇచ్చేందుకు హైదరాబాద్ కేంద్రంగా రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్కు కూడా బాధ్యతలు అప్పగించామన్నారు. సమావేశంలో జీఎం ఫైనాన్స్ సుబ్బారావు, సీఎంవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఎంవో బాలకోటయ్య, డీజీఎం శ్రీధర్, అడిషనల్ మేనేజర్ వెంకటేశ్, పీవోలు శ్రీనివాస్ తదితరులున్నారు.