కార్పొరేషన్, మే 12: సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ వై.సునీల్రావు తెలిపారు. నగరంలోని 24వ డివిజన్లో రూ.10 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ, 30వ డివిజన్లో రూ.5లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ వేసవిలోనే పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేసవిలో నిత్యం తాగునీరు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలోగా హౌసింగ్బోర్డు కాలనీ రిజర్వాయర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో 24 గంటలు తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ రిజర్వాయర్ పరిధిలో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు స్మార్ట్సిటీ కింద స్మార్ట్ తరగతి గదులను పూర్తి చేస్తామన్నారు. మొదటి విడుతలో తీసుకున్న పాఠశాలలను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధించేలా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కుర్ర తిరుపతి, నేతికుంట యాదయ్య, స్థానిక నాయకులు, డీఈ మసూద్ అలీ, నగరపాలక అధికారులు పాల్గొన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
కొత్తపల్లి, మే 12: క్రీడల్లో రాణించేవారిని నగరపాలక సంస్థ తరఫున ప్రోత్సహిస్తామని మేయర్ వై.సునీల్రావు అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడాశాఖ సహకారంతో ప్రారంభమైన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో భాగంగా రూ.8 లక్షల విలువైన 26 రకాల క్రీడలకు సంబంధించిన పరికరాలను డీవైఎస్వో కే రాజవీరుకు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడారు. సుమారు 2900 మంది చిన్నారులు శిబిరంలో శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ వింగ్ను ఏర్పాటు చేసి క్రీడాభివృద్ధికి చేయూతనందిస్తామన్నారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు స్కేటింగ్లో ఉచిత శిక్షణ ఇస్తామని, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ క్రీడలు క్రీడాశాఖాధికారుల సూచనతో పే అండ్ ప్లే పద్ధతుల్లో కొనసాగుతాయని తెలిపారు. డీవైఎస్వో రాజవీరు, డిప్యూటీ కమిషనర్ త్రయంభకేశ్వర్, డీఈ మసూద్ అలీ, ఏఈ గంగాధర్, టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.