కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ): దళితబంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల క్లస్టర్, గ్రౌండింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో దళితబంధుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారుల జాబితాను పునఃపరిశీలించుకోవాలన్నారు. క్లస్టర్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
మానకొండూర్, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాలో దళితబంధు ద్వారా మంజూరైన వాహనాలు, డెయిరీలు, ఇతర షాపులకు సంబంధించిన యూనిట్లను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు, క్లస్టర్ అధికారులు పరిశీలించాలని సూచించారు. వాహనాలకు బ్యాడ్జీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ (లోకల్ బాడీస్), శ్యాంప్రసాద్లాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలతారెడ్డి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నతానియేలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహర్రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేశ్, డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజవీర్, మెప్మా పీడీ రవీందర్, జిల్లా నెహ్రూ యువ కేంద్రం కో ఆర్డినేటర్ రాంబాబు, జిల్లా పశువైద్యాధికారి నరేందర్, ఎల్డీఎం, క్లస్టర్ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.