చొప్పదండి, మే 2: ప్రభుత్వ దవాఖానలో వైద్యపరీక్షలు చేయించుకుంటున్న గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకే ఆరోగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆవరణలో గర్భిణులకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ప్రతి సోమవారం నిర్వహిస్తున్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానకు వైద్యం కోసం వచ్చే గర్భిణులకు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందించాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలోనే మొదటగా చొప్పదండి దవాఖానలో ఈ కార్యక్రమం ప్రారంభించడం సంతోషకరమన్నారు.
వైద్యపరీక్షలు చేసుకునేందుకు వచ్చే గర్భిణులు ఆరోగ్యలక్ష్మి పథకం భోజనాన్ని స్వీకరించాలని కోరారు. ఆరోగ్య కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారం, పాలు, గుడ్లు, బాలామృతం, మందులతో సాధారణ ప్రసవం ద్వారా పండంటి బిడ్డలకు జన్మనిచ్చి ఆరోగ్యకరంగా ఉండాలని సూచించారు. కార్పొరేట్ దవాఖానలకు వెళ్లి ఖర్చులపాలు కాకుండా ప్రభుత్వ దవాఖానలో కల్పిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏసీడీపీవో సౌందర్య, మెడికల్ ఆఫీసర్ రమాదేవి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గర్భిణులు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
గంగాధర, మే 2 : పౌష్టికాహారం తీసుకోవడంతోనే మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సీడీపీవో కస్తూరి అన్నారు. సోమవారం గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 38 మందికి ఆరోగ్య పరీక్షలు చేయించడంతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని వడ్డించారు. అనంతరం ఎర్లీ రిజిస్ట్రేషన్, పౌష్టికాహారం తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వ దవాఖానలో సాధారణ ప్రసవాలు, సిజేరియన్లపై గర్భిణులకు వివరించారు. ఇక్కడ సర్పంచ్ వేముల లావణ్య, డాక్టర్ సురేశ్, సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బంది, గర్భిణులు, మహిళలు తదితరులు ఉన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పౌష్టికాహారం
రామడుగు, మే 2 : పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే గర్భిణులకు ప్రతి సోమవారం పౌష్టికాహారం అందించాలన్న కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు మండలంలోని రామడుగు, గోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు పౌష్టికాహారం అందించినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద పేర్కొన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా అందించే ఆహారంలో మంచి పోషకాలైన ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాలు, బెల్లంతో పాటు అన్నం, సాంబారు, కోడిగుడ్డు, పాలు అందజేస్తారన్నారు.
ఆయా పీహెచ్సీల్లో వైద్యులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ముందస్తు పేర్ల నమోదు, పౌష్టికాహారం, సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించారు. పోషణ్ అభియాన్లో భాగంగా కొక్కెరకుంట ఒకటో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో రామడుగు సర్పంచ్ పంజాల ప్రమీల, వైద్యాధికారులు రాజేందర్, రామకృష్ణ, సీహెచ్వో నారాయణ, పవన్కుమార్, శశికళ, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు లిలత, విజయ, పద్మజ, సావిత్రి, లావణ్య, హుస్సేనా, కనకలక్ష్మి పాల్గొన్నారు.