ధర్మపురి, మే 1: పట్టుదలతో చదివితే సర్కారు కొలువు సులువేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శ్రద్ధ, సాధించాలనే తపన, పట్టుదల ఉంటే ఉద్యోగం సాధించవచ్చని, ఈ క్రమంలో ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని పిలుపునిచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ, ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న అభ్యర్థులకు ‘ధర్మపురి ఈ-క్లాస్ రూమ్’ పేరుతో ఆదివారం ధర్మపురిలోని ఎస్సారార్ గార్డెన్స్లో ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించి పలు సూచనలు చేశారు. దేశంలో, రాష్ట్రంలో మంచి విజన్ ఉన్న ప్రభుత్వాలు ఉంటేనే ప్రజలకు పూర్తి స్థాయి మేలు జరుగుతుందన్నారు. రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు లక్ష 32వేల ఉద్యోగాల భర్తీ పూర్తయిందన్నారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో 91వేల ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించామన్నారు. అంతటితో ఆగకుండా ఉద్యోగార్థుల కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ శాఖల స్టడీ సెంటర్లను కోచింగ్ సెంటర్లుగా మార్చి సీఎం ఆదేశాల మేరకు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. స్టడీ మెటీరియల్, ఇతరత్రా సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పిస్తామని వివరించారు. కరీంనగర్కు చెందిన లక్ష్యం, వికాస్ అకాడమీల ఫ్యాకల్టీ ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తారన్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం రెండు నెలలు, గ్రూప్స్ అభ్యర్థులకు మూడు నెలల పాటు పూర్తి ఉచితంగా స్టడీ మెటీరియల్, యాప్, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ఉచిత శిక్షణ కోసం ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల శిక్షణ కోసం 571 దరఖాస్తులు, గ్రూప్స్కు ప్రిపేరయ్యే అభ్యర్థుల నుంచి 469 చొప్పున మొత్తం 1040 దరఖాస్తులు స్వీకరించామన్నారు. వీరికి ధర్మపురి పట్ణంలోని న్యూటీటీడీ, షాదీఖానలో మధ్యాహ్న భోజన సౌకర్యంతో పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ స్నేహలతను అభినందించారు.
లక్ష్యం మేరకు ఇక్కడి దాకా
తాను 1976లో సింగరేణిలో ఉద్యోగం సాధించానని, అంతటితో ఆగకుండా పట్టుదలతో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేశానని చెప్పారు. ఇప్పుడు ప్రజలకు సేవలందించే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి మంత్రిని కాగలిగానన్నారు. యువతీయువకులు సైతం తాము సాధించిన దానితో సంతృప్తి చెందకుండా ఉన్నతస్థాయికి చేరుకొనేందుకు నిరంతరం శ్రమించాలన్నారు. కలలు కనడమే కాదు వాటిని తప్పక నెరవేర్చుకోవడమే లక్ష్యంగా క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని యువతకు మంత్రి సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యం కావాలి
ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చదవాలని హైదరాబాద్ మేధ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, మోటివేషనల్ స్పీకర్ డా. చిరంజీవి పిలుపునిచ్చారు. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడేలా ఒక పెద్ద లక్ష్యం పెట్టుకొని చదవాలన్నారు. పాజిటివ్గా ఆలోచించాలని, నెగెటివ్గా ఆలోచిస్తే ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతాయన్నారు. అనంతరం ఉస్మానియా ప్రొఫెసర్ డా. తిరుపతి కుమార్ మాట్లాడుతూ.. నిత్యం తరగతులకు హాజరవుతూ, అధ్యాపకులు చెప్పేది శ్రద్ధగా వింటూ స్టడీ మెటీరియల్ను క్రమపద్ధతిలో చదివితే ఉద్యోగం గ్యారంటీ అని పేర్కొన్నారు. ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ స్నేహలత మాట్లాడుతూ.. ఉద్యోగార్థుల కోసం ఎల్ఎం కొప్పుల ఆర్గనైజేషన్ సేవలు నిరంతరం కొనసాగుతాయన్నారు. కాగా. కార్యక్రమానికి దాదాపు 1500 మంది ఉద్యోగార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ డా. ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఆర్బీఎస్ కన్వీనర్ సౌళ్ల భీమయ్య, ఎంసీ మాజీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, కరీంనగర్ లక్ష్యం, వికాస్ అకాడమీల డైరెక్టర్లు ఉమా ప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
అన్ని విషయాలు తెలుసుకున్న
నేను డిగ్రీ పూర్తి చేశా. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రిపేరవుతున్న. ఇప్పటివరకు ఎలా చదవాలి, ఏం చదవాలని కొంత కన్ఫ్యూజన్ ఉండేది. ఈ అవగాహన కార్యక్రమంలో అన్ని విషయాలు తెలుసుకున్న. ప్రతి రోజూ శిక్షణ తరగతులకు హాజరవుతా. పోలీస్ శాఖలో ఉద్యోగం సాధిస్తా.
-బుద్ద సంధ్య, రాయపట్నం
పోటీపరీక్షలపై అవగాహన పెరిగింది..
నేను డిగ్రీ పూర్తి చేశా. గ్రూప్-2లో ఉద్యోగం సాధించాలనేది నా కోరిక. కానీ పరీక్ష విధానంపై అవగాహన లేకుండె.. మంత్రి ఈశ్వర్ సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతుల ప్రారంభం కార్యక్రమానికి హాజరయ్యా. వ్యక్తిత్వ వికాస నిపుణుడు చిరంజీవి సార్, ఓయూ ప్రొఫెసర్ తిరుపతికుమార్ సార్ పోటీ పరీక్షల గురించి వివరించారు. ఇప్పుడు పోటీ పరీక్షలపై పూర్తిగా అవగాహన కలిగింది. ప్రతి రోజూ శిక్షణ తరగతులకు హాజరై కచ్చితంగా గ్రూప్-2 క్యాడర్ ఉద్యోగం సాధిస్తా.
-గోపతి అనూష, రాయపట్నం
కోచింగ్ కోసం దూరం వెళ్లడం తప్పింది..
గ్రూప్స్కు ప్రిపేరవుతున్న. కోచింగ్ కోసం హైదరాబాద్ లేదా కరీంనగర్కు వెళ్దామనుకున్న. అదృష్టం కొద్దీ మంత్రి ఈశ్వర్ సార్ ధర్మపురిలోనే శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నారని తెలుసుకొని సంతోషపడ్డ. ఆదివారం శిక్షణ తరగతుల ప్రారంభం కార్యక్రమానికి హాజరయ్యా. మొదటి రోజు అన్ని విషయాలపై వక్తలు పూర్తి అవగాహన కల్పించారు. గ్రూప్స్లో ఉద్యోగం సాధిస్తా.
– బీ మంజుల, రాయపట్నం