కార్పొరేషన్, ఏప్రిల్ 27: కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే నగరంలోని పశుసంవర్ధక శాఖకు చెందిన పదెకరాల స్థలాన్ని కేటాయించగా ఈ స్థలాన్ని ఇప్పటికే టీటీడీ బృందం పరిశీలించింది. బుధవారం దేవాలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలానికి సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్ను కొత్తపల్లి రెవెన్యూ అధికారులు టీటీడీ సిబ్బందికి అందజేశారు. ఈ దేవాలయాన్ని ఏడాదిన్నరలోనే పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దీనికనుగుణంగానే ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మంత్రి పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ స్థలాన్ని కేటాయించడంతో దానికి సంబంధించిన పత్రాలను టీటీడీ అధికారులకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా పొజిషన్ సర్టిఫికెట్ను అందించడంతో టీటీడీ అధికారులు ఆలయ నిర్మాణానికి ప్రణాళికలను తయారు చేస్తున్నారు. కార్యక్రమంలో టీటీడీ ఏఈవో మునిరత్నం, ఏఈ చాల్మా నాయక్, సర్వేయర్ హరినాథ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, కొత్తపల్లి ఇన్చార్జి తహసీల్దార్ గడ్డం సుధాకర్, డిప్యూటీ తహసీల్దార్ నవాజ్ ఉన్నారు.