ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు.. విప్లవాల ఖిల్లా.. ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసింది. కష్ట కాలంలో అండగా నిలువడమే కాదు.. ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు, గులాబీ పార్టీ విజయాలకు వేదికైంది. ఇంటి పార్టీ ఆవిర్భవించి 21 పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం..
కరీంనగర్, ఏప్రిల్ 26 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : అది తెలంగాణలో సాంస్క ృతిక, జీవన విధ్వంసం యథేచ్ఛగా సాగుతున్న సమయం.. మన యాస, భాషలను మనమే అసహ్యించుకునేలా చేసిన ఆంధ్రోడి చాతుర్యం.. మన గడ్డ చరిత్రను మన కళ్ల ముందే మట్టిలో కలిపేస్తున్న సందర్భం.. మన కవులు, కళాకారులకు తీరని అవమానం.. మన పండుగలు, పబ్బాలపై అంతులేని వివక్ష.. వాళ్ల పొలాలకు మన గోదావరి, కృష్ణా జలాలు.. అక్కడ మూడు పంటలకు నీళ్లు.. ఇక్కడ నదులున్నా బీళ్లు.. చివరికి ఎండే పంటలు.. ఇంకా ఆకలి కేకలు.. ఆత్మహత్యలు.. వాళ్లవి కొలువులు మనవి బానిస బతుకులు.. ప్రాంతం మనది.. పాలన వాళ్లది.. కష్టం మనది.. దోపిడీ వాళ్లది.. ఇదిగో ఇలాంటి సందర్భంలోనే తెలంగాణలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ఎజెండాగా కదిలి, సమైక్య సంకెళ్లు తెచ్చింది. అరవై ఏళ్ల కలను సాకారం చేసి.. వరుసగా రెండుసార్లు అధికారం చేజిక్కించుకొని.. ప్రజారంజక పాలన సాగిస్తున్నది. అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దేశానికి దిక్సూచిలా ఉండేలా ఎన్నో పథకాలను అమల్లోకి తెచ్చారు. తనకు అన్ని విధాలా కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే విప్లవాత్మక స్కీంలకు అంకురార్పణ చేశారు.
2001 ఏప్రిల్ 27: కేసీఆర్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలుగుదేశం పార్టీకి, తన శాససభ సభ్యత్వానికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ ఆవిర్భావానికి నాంది పలికారు.
2001 మే17: కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల వేదికగా ‘సింహగర్జన సభ’ నిర్వహించారు. లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పా టును కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. తెలంగాణ వచ్చేదాకా మడమ తిప్పబోనని ప్రతిన బూనారు. అప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఈ సభ విజయవంతం చేసిన ఘనత ఈ గడ్డకు దక్కింది.
2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 ఎంపీటీసీలు, 85 జడ్పీటీసీలు, 3000 మంది సర్పంచులు, రెండు జిల్లా పరిషత్ స్థానాలను కైవసం చేసుకుంది.
2004 జూన్ 7: 2004లో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికిన కేసీఆర్, తనదైన స్థాయిలో చక్రం తిప్పి, ఆ యేడాది జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించేలా చేయగలిగారు. అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఈ ఘనత కూడా ఈ గడ్డకే దక్కింది. 2005 జనవరిలో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు కూడా టీఆర్ఎస్ విజయమే. అప్పుడు కూడా కరీంనగర్ ఎంపీగానే ఉన్నారు.
2006 సెప్టెంబర్ 12: కరీంనగర్ లోకసభ స్థానానికి కూడా కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ వాదం లేనే లేదంటూ నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అవహేళన వ్యాఖ్యలతో కలత చెందిన ఆయన, పదవిని తృణప్రాయంగా భావించి.. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం పదవుల త్యాగానికి నిలిచిన ఘనత ఈ ప్రాంతానికి దక్కింది.
2006 డిసెంబర్ 7: కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో 2,01,582 ఓట్ల మెజార్టీనిచ్చి ఈ గడ్డ ప్రజలు కేసీఆర్ను గెలిపించారు ప్రత్యేక తెలంగాణ వాదం ఉందని నలుమూలలా చాటి చెప్పిన చరిత్ర ఉమ్మడి జిల్లా ప్రజలకు దక్కింది. ఈ ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పునర్జన్మనిచ్చింది.
2009 నవంబర్ 11: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు కరీంనగర్లోని తన భవన్ నుంచి బయలు దేరిన కేసీఆర్ను అల్గునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఈ ప్రాంత ప్రజలు ఎదురేగి కేసీఆర్ మద్దతుగా నిలిచారు. ఈ గడ్డపై జరిగిన అరెస్టు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
2011 సెప్టెంబర్ 23: ప్రత్యేక తెలంగాణ సాధన కోసం చరిత్రలో నిలిచిపోయే సకలజనుల సమ్మెకు కరీంనగర్ గడ్డ మీద నుంచే ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగిన సభలో సకలజనుల చారిత్రక సమ్మెకు రణభేరీ మోగించారు. ఈ సమ్మె యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది.
2012 నవంబర్ 7, 8: ఈ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర సమితి రెండు రోజుల పాటు కార్యవర్గ సమావేశాలను అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రతిమ హోటల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యవర్గ సమావేశాల్లో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు.. తెలంగాణ సాధించే వరకు తమ పోరాటం విరమించేది లేదని ఈ గడ్డ వేదికగా ప్రతినబూనారు.
2013 సెప్టెంబర్ 7: తెలంగాణ సాధనకు పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా శిబిరాలను నిర్వహించి తొలి శిబిరాన్ని హుజూరాబాద్ కేంద్రంగా ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఆనాడు బ్రోచర్లు, పుస్తకాల ద్వారా అందించిన సమాచారం, నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి ఆనాడు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించిన తీరు ఉద్యమం వైపు అందరినీ కదిలించింది.
2014 ఏప్రిల్ 13: ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు శ్రీ రాజరాజేశ్వర కళాశాల వేదికగా జరిగిన బహిరంగ సమావేశంలో తొలి సమర శంఖారావం పూరించారు. అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది.
2014 ఆగస్టు 5: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తదుపరి ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి అధికారిక పర్యటన చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ఈ గడ్డపై నుంచి ప్రకటించారు. ఈ పథకం ప్రస్తుతం దేశ దృష్టిని అకర్షించడమే కాదు.. యావత్ దేశానికి రోల్మాడల్గా నిలిచింది.
2015 జూలై 4: రాష్ట్రంలో అంతరించి పోతున్న అటవీ సంపద పెంచాలన్న లక్ష్యంతో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మొదట హుస్నాబాద్లో ప్రారంభించారు. ప్రస్తుతం దిగ్విజయంగా కొనసాగుతున్నది.
2016 మే 2: ప్రాజెక్టుల రీ డిజైనింగ్కు శ్రీకారం చుట్టిన తర్వాత కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దడంలో భాగంగా ఆనాటి ఉమ్మడి జిల్లాలోని మేడిగడ్డ వద్ద కాళేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేశారు. ఈ పథకం పనులు ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని స్వల్పకాలంలో పూర్తిచేసి రికార్డు సృష్టించడానికి ఈ గడ్డ వేదికైంది.
2017 జూలై 12: కరీంనగర్లోని మానేటి తీరాన (బతుకమ్మ పాయింట్ వద్ద) మహాగని మొక్క నాటి, మూడో విడత హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తన మనమడు హిమాన్ష్ పేరు మీదు మరో కదంబ మొక్క నాటారు.
2018 ఫిబ్రరి 26: రైతాంగ చరిత్రలో నూతన అధ్యాయానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ అంబేద్కర్ మైదానంలో జరిగిన సభా వేదికగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తతం ఇవి దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. అంతే కాదు.. రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఇదే వేదికపై నుంచి ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకం యావత్ రైతాంగానికి ఒక భరోసాను కల్పిస్తోంది.
2018 మే 10: లక్షలాది మంది రైతుల ఆశలకు జీవం పోస్తూ హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లి- ఇందిరానగర్ వేదికగా జరిగిన సభలో రైతు బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లా గడ్డపై నుంచి ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకాన్ని కేంద్రంతో సహా అన్ని రాష్ర్టాలు అమలు చేసే యోచనలో ఉన్నాయి. అన్నదాతల జీవన గమణానికి ఈ వేదిక జీవనాడిలా నిలిచింది. ఇప్పటికే ఈ పథకం కింద రూ.50 వేల కోట్లను అన్నదాతల ఖాతాల్లో వేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
2018 సెప్టెంబర్ 7: ప్రభుత్వాన్ని రద్దుచేసిన తర్వాత తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రజా ఆశీర్వాద సభ పేరుతో పూర్వ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ గడ్డ వేదికగా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఆ మేరకు 88 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు కూడా మన ఉమ్మడి జిల్లానే వేదికైంది.
2019 జనవరి 1: రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ప్రాజెక్టుల బాటతో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. 1న రాత్రి తీగలగుట్టపల్లికి చేరుకుని, 2న మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్హౌస్ను పరిశీలించారు. 3న రోడ్డుమార్గాన కన్నెపల్లి నుంచి అన్నారం దాకా గ్రావిటీ కెనాల్, సుందిళ్ల బ్యారేజీ, సుందిళ్ల, రాజేశ్వరరావుపేట పంప్హౌస్లను పరిశీలించారు.
2019 మార్చి 6: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన మొదటి సన్నాహక సమావేశాన్ని ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా ఏర్పాటు చేయగా.. ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హాజరై కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సభ యావత్తు రాష్ట్రంలోని టీఆర్ఎస్ శ్రేణులకు ఒక దిశానిర్దేశంలా నిలిచింది.