కరీంనగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పోలీస్ కావడం మీ లక్ష్యమా..? ఖాకీ యూనిఫాం వేసుకోవడం మీ ఆశయమా..? చేతిలో లాఠీ.. నెత్తిన టోపీతో సమాజ రక్షకుడిగా నిలువాలనుందా..? అందరిలో ఒకరిలా కాకుండా.. అందరికీ భద్రతనిచ్చే బాధ్యతాయుతమైన వృత్తిలో చేరాలనుందా..? అయితే మరెందుకాలస్యం! మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పోలీస్ కొలువుల జాతర మొదలైంది. వందో వెయ్యో కాదు.. 16,027 కానిస్టేబుల్, 587 ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానే వచ్చింది. నిరుద్యోగ యువత ఆనందానికి అవధుల్లేకుండా పోగా, మరోవైపు ఉద్యోగార్థులకు పోలీస్ యంత్రాంగం ప్రోత్సాహం అందిస్తున్నది. ఇప్పటికే జాబ్స్కు సంబంధించి ఉచిత శిక్షణ ప్రారంభించింది. మరోవైపు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనరేట్ శిక్షణ కేంద్రం (సీటీసీ)లో సోమవారం నుంచి ట్రైనింగ్ మొదలు కాగా, విజయమే లక్ష్యంగా యువత కృషి చేస్తున్నది.
పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జిల్లాల వారీగా ఆయా విభాగాల్లో పోస్టుల వివరాలు సేకరించిన యంత్రాంగం, ప్రభుత్వానికి నివేదించింది. ఆ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ జారీచేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 16,027 కానిస్టేబుల్, 587 ఎస్ఐ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. అంచనాలకు అందనంత భారీ మొత్తంలో ఖాళీల భర్తీకి పూనుకున్నది. నోటిఫికేషనే కాదు విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించింది.
మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నది. న్యాయపరంగా ఎక్కడా చిక్కులు రాకుండా చూసుకొని నోటిఫికేషన్లు జారీ చేసిందని నిపుణులు చెబుతుండగా, ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ ఖాళీలు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన చరిత్ర గతంలో లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి పోలీస్శాఖకు చెందిన విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తారన్న నమ్మకంతో ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. ఆయా పోస్టుల ఎంపికకు అవసరమయ్యే సిలబస్తో కుస్తీ పడుతున్నారు. విజయమే లక్ష్యంగా పగలూ రాత్రి కష్టపడుతున్నారు.
ఇప్పటికే శిక్షణ..
ప్రభుత్వం నుంచి ఎలాగూ నోటిఫికేషన్ వస్తుందని భావించి.. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే జిల్లా పరిపాలన, పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు శారీరక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్ఐ, కానిస్టేబుళ్ల ఉద్యోగాల ఎంపిక కోసం ఆసక్తి ఉన్న యువతకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వారధి సొసైటీ ద్వారా ఇటీవల ఉచిత శిక్షణ ఇచ్చారు. అందులో భాగంగా కరీంనగర్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శారీరక పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలకు హాజరైన 6,500 మంది అభ్యర్థులకు ప్రీ ఫైనల్ మాదిరిగా రాత పరీక్ష నిర్వహించారు. కాగా, ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఉచిత శిక్షణకు ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. అందులో భాగంగా ఈ నెల 22 కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో శారీరక పరీక్షలు నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులకు సోమవారం నుంచి కరీంనగర్ కమిషనరేట్ శిక్షణ కేంద్రం (సీటీసీ)లో శిక్షణ ప్రారంభమైంది. సీటీసీలో 300 మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు శిక్షణ ఇస్తుండగా, మహిళా అభ్యర్థులకు హైదరాబాద్లోని హయత్ నగర్లో శిక్షణ ఇస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలి
పోలీస్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన నేపథ్యంలో గ్రంథాలయం ద్వారా సమకూర్చుతున్న పుస్తకాలు, విజ్ఞాన సంపదను వినియోగించుకోవాలి. గతంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్దమొత్తంలో నోటిఫికేషన్లు జారీ చేసిన దాఖలాలు లేవు. సీఎం ఇచ్చిన ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలి. తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చుకోవాలి. అంతేకాదు గ్రంథాలయంలో ప్రిపరేషన్కు సంబంధించిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏమైనా కావాలన్నా తెప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి అపోహలకు పోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష్యాన్ని చేరుకోవాలి.
– ఏనుగు రవీందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ (కరీంనగర్)
ఈసారి ఉద్యోగం సాధిస్తా..
నా పేరు అనంతుల రాజేందర్. మాది పెగడపల్లి మండలం నంచర్ల గ్రామం. కేసీఆర్ సార్ ఉద్యోగాల ప్రకటన చేసిన వెంటనే హైదరాబాద్కు వచ్చి 45 రోజులుగా కోచింగ్ తీసుకుంటున్న. కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1,2,3 ఉద్యోగాల సాధనకు చాలా కష్టపడుతున్న. గతంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగానికి ప్రయత్నించిన. తృటిలో చేజారిపోయింది. ఈ విడుతలో కచ్చితంగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. మేం అనుకున్నట్లుగానే పోలీసుశాఖలో వేలాది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం సంతోషంగా ఉంది. కేసీఆర్ సార్కు థాంక్స్.
– అనంతుల రాజేందర్, నంచర్ల, పెగడపల్లి మండలం, జగిత్యాల జిల్లా
ఈసారి ఎలాగైనా జాబ్ సాధిస్త..
పోలీసు కావాలనేది నా చిన్ననాటి కల. 2018లో మొదటిసారి ప్రయత్నించిన. నాలుగు మార్కుల తేడాతో ఉద్యోగానికి దూరమైన. అలాంటి తప్పు మరోసారి చేయను. పక్కా ప్లానింగ్తో ప్రిపేరవుతున్న. ప్రభుత్వ ఉచిత కోచింగ్ సెంటర్ కలిసివచ్చింది. లేదంటే ట్రైనింగ్ కోసం ఇబ్బందిపడాల్సి వచ్చేది. వేలకు వేలు ఖర్చయ్యేది. ఇప్పుడు ఒకే సారి 16వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం చాలా సంతోషం. ఈ సారి ఎలాగైనా జాబ్ సాధిస్త. నా కలను సాకారం చేసుకుంట.
– నైనాల హరీశ్, కానిస్టేబుల్ అభ్యర్థి, కిషన్రావుపేట (వెల్గటూర్)