కరీంనగర్ రూరల్/చొప్పదండి: ఏప్రిల్ 25: కరీంనగర్రూరల్ మండలం నగునూర్ శివారులో హార్వెస్టర్, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకుల ప్రాణాలు గాల్లో కలిశాయి. పోలీసుల వివరాల ప్రకారం.. చొప్పదండికి చెందిన మాచర్ల దినకర్-గంగ దంపతులకు ముగ్గురు కొడుకులు. ఆదివారం రెండో కొడుకు ఉదయ్కుమార్ వివాహం తిమ్మాపూర్లో జరిగింది. ఈ పెండ్లికి మధ్యప్రదేశ్లో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న మూడో కొడుకు అక్షయ్కుమార్ (24)తోపాటు అతడి స్నేహితులు మహబూబ్నగర్కు చెందిన భవానీశంకర్ (24), ఉప్పరి తరుణ్ కలిసివచ్చారు. సోమవారం చొప్పదండిలో పెండ్లి రిసెప్షన్ ఉండగా అక్షయ్కుమార్, భవానీశంకర్, తరుణ్ కలిసి కారులో కూరగాయలు తెచ్చేందుకు సోమవారం తెల్లవారుజామున కరీంనగర్కు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు, హార్వెస్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్షయ్కుమార్, భవానీశంకర్ చనిపోయారు. తరుణ్ తీవ్రంగా గాయపడగా కరీంనగర్ దవాఖానకు తరలించారు. తరుణ్ తండ్రి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వీరి మరణంతో చొప్పదండిలోని పెండ్లింట పెను విషాదం అలుముకున్నది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.