మహిళా జర్నలిస్టుల సదస్సు ముగింపు సభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అమీర్పేట్, ఏప్రిల్ 24 : సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ సర్కారు జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హోటల్ హరిత ప్లాజాలో రెండు రోజులుగా జరుగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సు ఆదివారం ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 18వేల మంది జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులు కలిగి ఉన్నారన్నారు. రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారి కష్ట సమయాల్లో ముందుండి ఆదుకుంటున్నదని వివరించారు.
కొవిడ్ కష్టకాలంలో మృతి చెందిన 64 మంది జర్నలిస్టు కుటుంబాలను రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన నిధి నుంచి ఇప్పటివరకు రూ. 42 కోట్లను వెచ్చించామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఛాలెంజింగ్గా ఉండే జర్నలిస్టును వృత్తిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళలను అభినందించారు. తెలంగాణ సచివాలయ నూతన భవనంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా గదులు కేటాయించే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కవిత వెల్లడించారు.
వార్తా సంస్థల నిర్వహణలో పాశ్చాత్య దేశాల్లో అవలంబించే విధానాలను అందిపుచ్చుకోవడం వల్ల మహిళలకు జర్నలిస్టులుగా అవకాశాలు అందివచ్చాయని, ఆ అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ముందుకుపోతున్న మహి ళా జర్నలిస్టులను ప్రత్యేకంగా అభినందించారు. వర్క్ ప్లేస్లో వేధింపుల కట్టడికి అన్ని సంస్థల్లో మహిళల నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం తన విధానాలను స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ ముగింపు సభలో ఎమ్మెల్సీ వాణీదేవి, కార్పొరేటర్ సంగీతయాదవ్, మ హిళా జర్నలిస్టులు మాలిని సుబ్రహ్మ ణ్యం, ధన్య రాజేంద్రన్, సుమా బాల, శ్వేత, కవిత తదితరులు పాల్గొన్నారు.