కలెక్టరేట్, ఏప్రిల్ 12: స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం ఓటరు జాబితాల సవరణకు సహకరించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కోరారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ, వార్డు స్థానాలకు సంబంధించి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ షెడ్యుల్ విడుదల చేసినట్లు తెలిపారు. కాగా, కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆమె స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యుల్పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎలక్టోరల్కు సంబంధించి మండల ప్రజాపరిషత్, గ్రామ పంచాయతీల్లో నోటీసు బోర్డుపై ఓటరు జాబితాలను ఫొటోతో సహా ఈనెల 16వ తేదీ వరకు ఉంచాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈనెల 21 వరకు సరిచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మండల స్థాయిలో సంబంధిత ఎంపీడీవో, జిల్లా స్థాయిలో డీపీవో ద్వారా మార్పు చేసుకోవచ్చన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్, వివిధ పార్టీల నాయకులు నాంపెల్లి శ్రీనివాస్, మోహన్, కవ్వంపల్లి అజయ్, గోపాల్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలి
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన ఊరు-మన బడి కార్యక్రమంపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో శిథిలావస్థలో పాఠశాలల భవనాలు ఉంటే గుర్తించి తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ, కిచెన్ షెడ్లు, టాయ్లెట్స్, డైనింగ్ హాల్, తాగునీరు, ఇతర వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద జిల్లాలో 230 పాఠశాలల స్థితిగతులపై అంచనాలను ఫొటో క్యాప్షన్తో సహా రెండు రోజుల్లో డాటా అప్ లోడ్ చేసి నివేదికలు అందజేయాలని ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఏ స్థాయిలో కూడా పెండింగ్లో ఉండకుండా పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, పంచాయతీ రాజ్ ఈఈ, ఎంఈవోలు పాల్గొన్నారు.