జమ్మికుంట/వీణవంక, జూలై 21: హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం రాజుకుంటున్నది. ఎన్నికలు రాక ముందే ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈటల తనపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు తాయిలాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు కోట్లాది రూపాయల విలువైన కుట్టుమిషన్లు, గోడ గడియారాలు తెప్పించి పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. అయితే గుట్టుగా పంపిణీ చేస్తుండగా, ఆయాచోట్ల ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. ఐదు రోజుల క్రితం హుజూరాబాద్ పట్టణంలో ఇంటింటా ప్రచారం చేస్తున్న ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డికి నిరసన సెగ తగిలింది. ‘90 గడియారం ఇచ్చి ఓటు వేయాలని అడుగుతారా’ అంటూ ఓ వ్యక్తి ఆగ్రహించి, ఈటల ఫొటోతో ఉన్న గోడ గడియారాన్ని నేలకేసి కొట్టాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహించాడు. అయినా గడియారాలు ఇంటింటికీ తిరిగి అందజేస్తుండగా, ఆయాచోట్ల ప్రజలు తిరగబడుతున్నారు. తాను చేసే తప్పులను కప్పిపుచ్చుకునేందకు ఇతర పార్టీల తాయిలాలు ఇస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్కు, టీఆర్ఎస్కు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఆదరణను చూసి ఎలాగూ ఓడిపోతామనే భయంతోనే ప్రలోభాలకు తెరతీశారని చెబుతున్నారు. ఎవరెన్ని తాయిలాలు పంచినా గులాబీ జెండాయే ఎగురుతుందని స్పష్టం చేస్తున్నారు.
గడియారాలతో కడుపునిండుతదా..
ఓట్లత్తన్నయని ఇంటింటికీ ఈటల బొమ్మ ఉన్న గోడ గడియారాలు ఇత్తె మా కడుపు నిండుతదా. పదవిలో ఉన్నపుడు పేదల కడుపునింపే పని ఒక్కటి జెయ్యకపాయె. మా దళితుల భూములు గుంజుకొని, మళ్లా ఓట్లు అడుగేదానికి ఎట్లా వస్తడో చూస్తం.. పేదలకు మంచిచేయిమని సీఎం కేసీఆర్ సారు ఈటల రాజేందర్ను ఎమ్మెల్యేను జేస్తె మా పనులు ఇడిసిపెట్టి ఆస్తులు సంపాదించుకునే పనిలోనే ఉన్నడు. ఇప్పుడు పదవి పోయినంక మేం గుర్తుకు అస్తన్నమా ఈటలకు. కేసీఆర్ సారు ఇచ్చే పథకాలతోనే మా పేదోళ్ల కడుపులు నిండుతన్నయి. మా గురించి ఆలోచన జేసే సీఎం కేసీఆర్ సార్కే ఓటు వేసి, గెలిపించుకుంటం. ఊళ్లళ్ల అందరు కారు గుర్తుకే ఓటు వేస్తమని అంటర్రు. ఎప్పటికైనా టీఆర్ఎస్తోనే పనులు జరుగుతయి. మధ్యలో అచ్చినోళ్లు మధ్యలోనే పోతరు. బీజేపీకి ఓటెయ్యం.
టీఆర్ఎస్తోనే మంచి రోజులు..
ఇంతకు ముందు ఎన్నో పార్టీలను జూసినం. ఓట్లప్పుడు అచ్చి పనులు జేస్తమని చెప్పి మళ్లా పత్తకు అచ్చినోళ్లు లేరు. దళితులను పట్టించుకున్న పాపాన పోలే. ఎక్కడి పనులు అక్కడే ఉండేటియి. తెలంగాణ అచ్చినంక సీఎం కేసీఆర్ సార్ దయతో రోడ్లు వడ్డయి. మురుగు కాల్వలు కట్టిర్రు. తాగడానికి మిషన్భగీరథ నీళ్లు అత్తన్నయి, పల్లెప్రగతితో గ్రామాలు పచ్చగ ఉంటన్నయి. ప్రజలు ఆరోగ్యంగ ఉంటర్రు. ముఖ్యంగా పేద ప్రజలకు ఎన్నో పథకాలు ఇస్తర్రు. ఒక్క పని కూడా చెయ్యని బీజేపీకి ఓటు అడిగే హక్కులేదు. దళితుల కోసం సీఎం సార్ దళిత బంధు పథకం తీసుకవచ్చిండు. ఇన్ని పనులు చేస్తున్న టీఆర్ఎస్ను విడిచిపెట్టి బీజేపోళ్లకు ఓటెస్తరని గోడ గడియారాలు పంచిపెడ్తర్రు. అందుకే కోపం వచ్చి రోడ్డు మీద వాటిని పగులగొట్టినం. ఇంకో సారి మా దగ్గరికి రాకుండా బుద్దిచెప్పినం.
చల్లూరు, ఎలుబాకలో దళితుల ఆగ్రహం
తాయిలాల పంపిణీపై వీణవంక మండలం చల్లూరు, ఎలుబాకలో దళితులు మండిపడ్డారు. ఈటల రాజేందర్ ఫొటో, బీజేపీ పార్టీ గుర్తు బొమ్మతో ఉన్న గోడ గడియారాలను ఆ పార్టీ నాయకులు పంపిణీ చేయగా, చల్లూర్లో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా డప్పుచప్పుళ్ల మధ్య నడి రోడ్డుపై పడేసి పగులగొట్టారు. కాళ్లతో తొక్కి మహిళలు, పురుషులు నిరసన తెలిపారు. అలాగే ఎలుబాక గ్రామంలోనే నేలపైకి విసేరిసి పగులగొట్టారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల దళితులు మాట్లాడారు. అమాయకపు మాటలు, చిల్లర తాయిలాలతో దళిత జాతిని మోసం చేయలేవంటూ ఈటలపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈటల ఏమీ చేయలేదని, ఎన్నికలు వస్తున్నాయని దళితులను ప్రలోభ పెట్టేందుకు గోడ గడియారాలు పంపిణీ చేపిస్తున్నాడని ఆరోపించారు. నియోజకవర్గంలో దళితులను అణిచివేశాడని, ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ దళిత బంధు పథకం తెచ్చారని చెప్పారు. ఎళ్లవేళలా టీఆర్ఎస్ వెంటే ఉంటామని, రానున్న ఉప ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ దళిత సంఘం నాయకులు తాండ్ర శంకర్, తాండ్ర రమేశ్, ఊట్ల దేవయ్య, ఊట్ల జాన్, స్టీఫెన్, జీవయ్య, మరో 50 మంది మహిళలు, పురుషులు ఉన్నారు.
ఈటల దళితులను ఏనాడైనా దగ్గరకు తీసిండా?
గిన్నాళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటలకు మేం గుర్తుకు రాలేదు. దళిత జాతిని ఏనాడైనా దగ్గరికి తీసిండా..?. ఇయ్యాల పదవి పోంగనే మేం ఆదికచ్చినం సారుకు. ఎన్నో జెప్పిండు. మహిళలకు అదిజేత్త, ఇదిజేత్త అని నమ్మించిండు. కానీ ఒక్క పనీ జేయలె. పదవిలో ఉన్నపుడే జేయనోడు ఇప్పుడు మళ్లా గెలిపిస్తే ఏంజేత్తడు. అన్నీ అట్టి ముచ్చట్లే. గోడ గడియారాలు ఇత్తె ఓటేత్తమని అనుకుంటుండు. అది కాని పని. 60 గడియారం ఇచ్చి మా ఓటు కొందామని జూత్తుండు. దళిత జాతికి, మహిళలకు ఏంజేసిండని ఓటు అడుగేందుకు అత్తడో జూత్తం. ఆయన మనుషులు దొంగల్కెక్క ఇండ్లళ్ల సొచ్చి బతిలాడి గడియారాలు చేతులవెట్టి పోతన్రు. గిసోంటి వాటికి మనుసు మార్సుకొని దొంగలకు ఓటెయ్యం. దళితుల కోసం, మహిళల కోసం ఎన్నో పథకాలు తెచ్చిన సీఎం కేసీఆర్ సార్కే ఓటేత్తం.
దొంగసాటుగ ఇచ్చి పోతర్రు…
బీజేపోళ్లు దొంగల్లెక్క ఇండ్లల్ల జొచ్చి గోడ గడియారాలు ఇచ్చి పోతన్రు. ఎక్కడియి అని అడిగే సరికే ఉండనియ్యుర్రి అని జెప్పి చేతిలో పెట్టిర్రు. కవరు దీసి జూసెసరికి ఈటల రాజేందర్, పువ్వు గుర్తు ఉన్న గడియారం. కోపం అచ్చింది. మా వాడలో అందరం బయటికి అచ్చి.. ఇచ్చిన గోడ గడియారాలు దెచ్చి రోడ్డు మీద ఏసి పగులగొట్టినం. ఈ వాచీలు మాకేం అక్కరికి అత్తయి మా ఇంట్ల లేవా. ఏదో ఇచ్చి మా కడుపునింపినట్టు, ఇంతకు ముందు దీని మొఖం జూడనట్టు తెచ్చిత్తర్రు. బతుకులు బాగుపడే పనులు జెయ్యిమని అడుగితే ఈటల ఒక్కనాడు పట్టించుకోలే. ఇప్పుడేమో గోడ గడియారాలు ఇచ్చి ఓట్లు ఏపిచ్చుకుందామని అనుకుంటండు. గవన్నీ ఇగ నడువయి. టీఆర్ఎస్తోనే మా కులం, మహిళలకు పనులు అయితన్నయి. మా వార్డులో సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన పైసలతోనే అభివృద్ధి పనులు జేసినం. వచ్చే ఎన్నికలల్ల కారు గుర్తుకే ఓటేస్తం.